చంద్రబాబుతో మాటలేంటి ? మూసేయండి.. జగన్ సర్కార్ కు కేఏ పాల్ డిమాండ్ ..
ఏపీలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇవాళ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ప్రభుత్వం కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల నేపథ్యంలో రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం చంద్రబాబు కుప్పం టూర్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే కందుకూరు, గుంటూరు ఘటనల్లో మరణాలకు చంద్రబాబు కారణమయ్యారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలని కేఏ పాల్ కోరుతున్నారు.
ఇవాళ కుప్పంలో ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఉల్లంఘించి చంద్రబాబు రోడ్ షో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేఏ పాల్ మరోసారి తన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసుల్ని కోరారు. కుప్పం పోలీసులు ఇవాళ తెలివైన పనిచేశారని పాల్ ప్రశంసించారు. క్యాడర్ ను, చంద్రబాబును అడ్డుకోవడం కరెక్ట్ అన్నారు. ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసుల్ని కేఏ పాల్ ప్రశ్నించారు.

చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఆయనతో పోలీసులు చర్చలు జరపకూడదన్నారు. చంద్రబాబు ఇకపై రోడ్ షోలు చేయకుండా అడ్డుకోవాలని పోలీసుల్ని పాల్ కోరారు.
ఇంకా అనేకమంది చంద్రబాబు చేతిలో చనిపోకుండా చూడాలని పాల్ సూచించారు. ఇందుకోసం పోలీసులు యాక్టివ్ గా ఉండాలన్నారు. ఇప్పటికే చంద్రబాబు రోడ్ షోలు, ర్యాలీలపై నిత్యం విమర్శలు చేస్తున్న కేఏ పాల్.. తాజాగా వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని స్వాగతించారు.












Click it and Unblock the Notifications