కానిస్టేబుల్ హల్చల్: తనను చంపడానికే వచ్చాడని ఓ వ్యాపారిని చితకబాదాడు
హైదరాబాద్: ‘నన్నే హత్య చేసేందుకు వస్తావా' అంటూ ఓ కానిస్టేబుల్ రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి చితకబాదాడు. అంతేగాక ‘నీ అంతు చూస్తానంటూ' అతడ్ని బెదిరించాడు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. టప్పాచబుత్ర పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రఘు మంగళవారం మధ్యాహ్నం పోలీస్స్టేషన్ పరిధిలోని తాళ్లగడ్డ నుంచి శారదానగర్ వైపుగా వెళ్తున్నాడు. అతడి వెనుకాలే పూల మార్కెట్లో వ్యాపారం నిర్వహించే తాళ్లగడ్డకు చెందిన సురేందర్ వెళ్తున్నాడు. దీంతో ఒక్కసారిగా కానిస్టేబుల్ తన వాహనాన్ని ఆపాడు.
ఆ తర్వాత సురేందర్ను శారదనగర్ చౌరస్తాలో ఆపి తనను హత్య చేసేందుకే పథకంతో తన వెనకాల వస్తున్నావంటూ అతడిపై దాడికి దిగాడు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన వ్యాపారి ‘అసలు నువ్వెవరో నాకు తెలియదని, తాను గుడిమల్కాపూర్ పూల మార్కెట్కు వెళ్తున్నాని, నన్నెందుకు కొడుతున్నావంటూ' ప్రశ్నించాడు. కానిస్టేబుల్ ఇవన్నీ పట్టించుకోకుండా అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో స్థానికులు పెద్దఎత్తున గుమిగూడారు.
కానిస్టేబుల్ కావాలనే అతడిపై దాడి చేశాడని, అతడు కొద్దికాలంగా ఇలానే దాడులకు పాల్పడుతున్నాడని పలువురు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు అతడిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత మందిపై దాడిచేస్తాడని వారు వాపోయారు.
కాగా, ఈ కానిస్టేబుల్ కొన్ని రోజుల క్రితం గతంలో పనిచేసిన ఇన్స్పెక్టర్లపై, ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లపై నగర కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. తనను పోలీసులే హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వాపోతుంటాడు. దాడిలో గాయపడిన వ్యాపారి టప్పాచబుత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.