పెళ్లైన తర్వాతా యువతితో వివాహేతర సంబంధం: ఆర్ఎంపీ దారుణ హత్య
కర్నూలు: పెళ్లైన తర్వాత కూడా ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగించిన ఓ ఆర్ఎంపీని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం పదిమందిని అరెస్ట్ చేశారు. మూడు ద్విచక్ర వాహనాలు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోసిగి పోలీసుస్టేషనులో శనివారం ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బోయ ఈరన్న(22) జులై 7 హత్యకు గురయ్యాడు. కాగా, ఈ హత్యకు సంబంధించిన డీఎస్పీ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. కోసిగికి చెందిన నాగార్జున భార్యతో మృతుడు ఈరన్న వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున జీర్ణించుకోలేక అత్తామామతోపాటు బంధువులను నిలదీశాడు.
ఈరన్ననే అల్లుడిగా చేసుకోమ్మని, లేదంటే రైలు కింద పడి చనిపోతానని బెదిరించాడు. దీంతో ఎలాగైనా ఈరన్నను అంతమోందించాలని నాగార్జున తల్లి గుండమ్మతోపాటు బంధువులు, మామ స్వామిదాసు, అతని కుమారులు, ఇద్దరు తమ్ముళ్లు కుట్ర పన్నారు.
ఈక్రమంలో గత జులై 7న రాత్రి జుమ్మాలదిన్నె నుంచి గవిగట్టుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఈరన్నని కోసిగి సమీపంలో వీరూ అటకాయించారు. అతన్ని చితకబాదారు. తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా కర్రలతో తీవ్రంగా కొట్టారు. తలపై బండరాయితో మోదారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని రైలు పట్టాలపై పడేశారు.
ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆర్ఎంపీ వైద్యుల మధ్య విభేదాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. 10 మంది ఆర్ఎంపీ వైద్యులను, గ్రామస్థులను విచారించారు.
చరవాణి ట్యాపింగ్, క్లూస్టీమ్ ఆధారంగా పెద్దకడబూరు మండలం గవిగట్టుకు చెందిన కోసిగి స్వామిదాసు, కోసిగి తిక్కయ్య, కోసిగి గోపాల్, కోసిగి నాగరాజు, కోసిగికి చెందిన కొండగేని నాగార్జున, నాడిగేని మారయ్య, అరవలి నరసింహులు, బటికేరి శంకరయ్య, కోసిగి శ్రీరాములు, కొండగేని గుండమ్మలను అరెస్టు చేశారు.
హత్యకు ఉపయోగించిన ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును అతి తక్కువ కాలంలో చేధించిన సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐ ఇంతియాజ్బాషా, శిక్షణ ఎస్ఐ రాజారెడ్డిలను డీఎస్పీ అభినందించారు.