పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని.. విద్యార్థినిపై హెచ్ఎం రేప్
హైదరాబాద్: నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు గురిచేసిన ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, 22ఏళ్ల అమ్మాయిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలం వెంకట్ రెడ్డిపల్లికి చెందిన ఓ అమ్మాయి(22) తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోవడంతో మేనమామ వద్ద పెరిగింది.
ఆమె హైస్కూల్లో చదువుతున్న సమయంలో ఎదురింట్లో భార్యా, పిల్లలతో కలిసి సురేందర్ రెడ్డి అనే ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉండేవాడు. తాను స్కూల్లో చదువుతున్నప్పుడు పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత అమ్మాయి తెలిపింది.
తన భవిష్యత్ ఏమిటని అతడ్ని ప్రశ్నిస్తే మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోపాటు బెదరింపులకు గురిచేశాడని.. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని బాధిత అమ్మాయి తెలిపింది. కాగా, 2011లో సదరు యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే అతడితో వైవాహితక జీవితం గడపరాదని.. ఒక వేళ తన మాట వినకుంటే ఆమె భర్తతో అక్రమ సంబంధం విషయం చెబుతానని సురేందర్ రెడ్డి ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.
ఈ విధంగా తనను బెదిరింపులకు గురి చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత అమ్మాయి కన్నీటిపర్యాంతమైంది. ఇప్పటికైనా సురేందర్ రెడ్డిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బాధిత అమ్మాయి ఫిర్యాదు చేసింది. స్పందించిన కమిషన్ నెలరోజుల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డిఈఓకు నోటీసులు జారీ చేసింది.