ఏపీకి ముంచుకొస్తున్న ఉపద్రవం.. వరుస తుఫాన్ల గండం ... డిసెంబర్ లో బురేవి , టకేటి తుఫాన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపద్రవం ముంచుకొస్తుంది . వరుస తుఫాన్ల గండం పొంచి ఉంది. ఇప్పటికే అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలు, ప్రస్తుతం నివర్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా, తుఫానుల కారణంగా దెబ్బతిన్న ఏపీకి ఇంకా వర్షాలు వరదల బెడద ఉందని చెప్పింది వాతావరణ శాఖ . మరో రెండు తుఫాన్ల ముప్పు ఉందని పేర్కొనడం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఏపీ పరిస్థితి మారింది .
Recommended Video
కడప ,ప్రకాశం జిల్లాలలో నివర్ బీభత్సం ఇలా: శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలిక మూసివేత
తిరుపతి సమీపంలో కొనసాగుతున్న వాయుగుండం .. ఈదురుగాలులతో భారీ వర్షాలు
మరోపక్క చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది తిరుపతి కి 35 కిలోమీటర్లు నెల్లూరుకు 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ... డిసెంబర్ 2వ తేదీన 'బురేవి' తుఫాన్
ఈనెల 29వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అది తీవ్ర వాయుగుండంగా మారనుందని , అది తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
డిసెంబర్ నెలలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన 'బురేవి' తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
డిసెంబర్ 5 న 'టకేటి' తుఫాన్
ఇక డిసెంబర్ 5వ తేదీన మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఈ అల్పపీడన ప్రభావంతో 'టకేటి' తుఫాను ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. 'టకేటి' తుఫాను ప్రభావంతో డిసెంబర్ 7వ తేదీన దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీకి వరుసగా పొంచి ఉన్న తుఫాన్ల గండం తో ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు వర్షాలు ,వరదలు ,తుఫానుల కారణంగా ఊహించని విధంగా పంట నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.