ఏపీ ఆలయాల్లో వరుస ఘటనలు.. నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం
ఏపీలో ఆలయాల్లో వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన, ఇక తాజాగా విజయవాడలోని దుర్గ గుడి వెండి రథంలోని మూడు సింహాల మాయం ఘటనతో పాటు మరో ఘటన కూడా ఏపీలో ప్రజలను టెన్షన్ పెడుతోంది. ప్రతిపక్ష పార్టీలకు , హిందూ సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తుంది .
నిడమానూరులో సాయిబాబా ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తుతెలియని ఆగంతకులు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు లో సాయిబాబా విగ్రహాన్ని నిన్న అర్ధ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. షిరిడి సాయి బాబా మందిరం బయట నెలకొల్పిన బాబా విగ్రహంలో తల భాగాన్ని విరగ్గొట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, స్థానికులు ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న సీసీ కెమెరాల రికార్డులను పరిశీలిస్తున్నారు.

సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవాలయాలపై దాడులు పెరిగాయి అని మండిపడుతున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని హిందూ దేవాలయాల పరిరక్షణకు నడుం బిగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే అంతర్వేది ఘటనపై చెలరేగిన దుమారం ఆగలేదు. ఇప్పుడు దుర్గ గుడి ఘటన , సాయిబాబా ఆలయంలో జరిగిన ఘటనతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications