మరో మహిళా ఎమ్మార్వోపై దాడికి యత్నం: టిడిపి నేతపై కేసు నమోదు
చిత్తూరు: కులం పేరుతో దూషించి, మహిళా తహశీల్దార్పై దాడికి యత్నించినందుకు తెలుగుదేశం పార్టీ నేతపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం రంగన్నగారిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది.
చిన్నగొట్టికల్లు మండల తహశీల్దార్ నారాయణమ్మ ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగన్నగారిగడ్డ గ్రామంలో ఆక్రమణకు గురైన చెరువు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు.
కాగా, టిడిపి బలపరిచిన ఆ గ్రామ సర్పంచ్ రమణారెడ్డి చెరువు వద్దకు చేరుకొని తహశీల్దార్ నారాయణమ్మను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించారు. అంతేగాక, భూముల స్వాధీన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో నారాయణమ్మ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై సర్పంచ్ రమణారెడ్డిని వివరణ కోరగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కులం పేరుతో దూషించలేదని, దాడికి పాల్పడలేదని తెలిపారు.
రెండు రోజుల క్రితం వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వోపై తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దాడి చేసిన ఘటన మరువక ముందే.. ఇలాంటి మరో ఘటన చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.