Madanapalle పారిశ్రామికవాడలో పేలుడు... ఒకరు మృతి,ఇద్దరికి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా మదనపల్లెలోని పారిశ్రామిక వాడలో పేలుడు చోటు చేసుకుంది. స్థానిక టీపీ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని లింగప్ప(42)గా గుర్తించారు. గాయాపాలైనవారిని మహేష్,నయాజ్ బాషాలుగా గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Recommended Video
యూకలిప్టస్ ఆయిల్ క్వాలిటీని పరీక్షించేందుకు వినియోగించే గ్యాస్ క్రోమోటోగ్రఫీ మెషిన్ను అమర్చుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మెషీన్ అమర్చడం కోసమే మృతుడు లింగప్ప బెంగళూరు నుంచి మదనపల్లెకి వచ్చినట్లు తెలుస్తోంది. అతను సర్వీస్ టెక్నీషియన్గా పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడ్డవారిలో శివ మహేష్ కంపెనీ యజమానిగా తెలుస్తోంది.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మదనపల్లె సీఐ నర్సింహులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కొంతకాలంగా ఏపీలోని పరిశ్రమల్లో వరుస ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు వారాల క్రితం విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ ప్లాంటులో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాజమాన్యం వెంటనే అప్రమత్తమై సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించడంతో ప్రాణనష్టం తప్పింది. దాదాపు 13 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
మహారాష్ట్రలోని పుణేలోనూ సోమవారం(జూన్ 7) ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్వీఎస్ ఆక్వా టెక్నాలజీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 18 మంది సజీవ దహనమయ్యారు. పరిశ్రమలో మరో 15 నుంచి 16 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.