గ్యాంగ్రేప్?:యువకుడి గదిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుంటూరు: జిల్లాలోని రేపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తన స్నేహితుడిగా భావిస్తున్న యువకుడి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు.
దీంతో చుట్టుపక్కల అంతా వెతికిన తల్లిదండ్రులు.. శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఉదయం అక్కడకు సమీపంలోని ఓ ఇంట్లో ఒక యువతి ఉరి వేసుకుని మరణించినట్లు ఆ ఇంటి యజమాని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా.. ఆ మృతదేహం తేజస్వినిదే అని తెలిసింది.
కాగా, ఆ యువతి నరసింహరావు అనే యువకుడు అద్దెకు ఉండే గదిలో శవమై కనిపించడంతో అతడి కోసం పోలీసులు వాకబు చేస్తున్నారు. తాను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన నరసింహరావు.. తన ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడని ఇంటి యజమాని చెప్పాడు.
అయితే అతడి అసలు పేరు నాగరాజు అని పోలీసుల విచారణలో తెలిసింది. అతడు తన పేరు, ఆచూకీ వివరాలు కూడా ఎందుకు రహస్యంగా ఉంచాడో తెలియరాలేదు.
అసలు అతడెవరో తమకు గానీ, తమ కుమార్తెకు గానీ తెలియదని తేజస్విని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఆమె అక్కడకు ఎందుకు వెళ్లిందో, ఆమె తనకు తానే ఉరేసుకుందా.. లేక ఏమైనా అఘాయిత్యం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్యాంగ్రేప్గా అనుమానం
తేజస్వినిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తేజస్విని కాలేజీకి వెళ్లడానికి నాగరాజు గది ముందు నుంచి వెళ్లేది. శుక్రవారం కూడా అదే విధంగా కాలేజీకి వెళుతున్న తేజస్వినిని నాగరాజు మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నాగరాజు మరికొందరితో కలిసి ఆమెపై అత్యాచారం చేయడం వల్లే చనిపోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.