ఘోరం: మహిళా వాలంటీరు దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా?
బాపట్ల: జిల్లాలోని వేమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని చావలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దొప్పలపూడి శారద(27) వాలంటీరుగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
కాగా, అదే గ్రామానికి చెందిన పద్మారావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. దీంతో పద్మారావు శారదను కత్తితో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
వైయస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ లో దారుణ ఘటన జరిగింది. నరసింహ(27) అనే వ్యక్తి ముఖంపై కొందరు స్థానికులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడ్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్ కు తరలించారు.
మూగ యువతిపై అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతాలు యువతులు, మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో మాటలు రాని యువతిపై అత్యాచారం జరిగింది. జకరయ్య అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం దురాగతానికి ఒడిగట్టాడని చెప్పారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తెనాలి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఇంటి వద్ద ఉండే జకరయ్య అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే యువతిపై జకరయ్య అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఫోన్ మాట్లే విషయంలో జరిగిన గొడవే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.