అక్రమ సంబంధం: భర్తను హత్య చేయించిన భార్య
తూర్పు గోదావరి జిల్లా కె. గంగవరం మండలం నల్లచెరువు పుంతకి గ్రామానికి చెందిన రాయుడు సోమరాజు తన భార్య కనకదుర్గాదేవి, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చారు. నగరంలోని రాజేంద్రనగర్ మండలం మణికొండలో నివాసం ఏర్పాటు చేసుకన్నారు. సోమరాజు స్థానిక పంచవటి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తుండగా, తన భార్య కనకదుర్గా అదే అపార్ట్మెంట్లో పని మనిషిగా చేరింది.
రాజేంద్రనగర్ మండలంలోని సన్ సిటీకి చెందిన గౌతంకుమార్ ఆ అపార్ట్ మెంట్లోనే నివాసం ఉంటున్న ఓ న్యాయవాది కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో పనిచేస్తుండడంతో గౌతంకుమార్, కనకదుర్గాదేవి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత విషయం తెలుసుకున్న భర్త సోమయాజులు భార్య కనకదుర్గాదేవిని పలుమార్లు మందలించాడు.
ప్రియుడు గౌతంకు కనకదుర్గాదేవి తన భర్త మందలించిన విషయాన్ని చెప్పింది. దీంతో ఎలాగైనా తమకు అడ్డుగా ఉన్న తన భర్తను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. తన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మహిళ భర్తను సోమరాజు హత్యకు సహకరించాలని గౌతం కోరాడు. ఒప్పుకోవడంతో అతనికి రూ. 3వేలు ఇచ్చాడు గౌతంకుమార్.
మద్యం సేవించేందుకని చెప్పి గత సెప్టెంబర్ 2న సోమరాజును ఇద్దరూ కలిసి సన్ సిటీకి తీసుకువెళ్లారు. పూటుగా మద్యం సేవించిన తర్వాత సోమరాజును ముర్తూజగూడ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. గౌతంకుమార్.. సోమరాజు గొంతు నులిమి కిందపడేయగా గోపాల్ అతని తలపై బండరాయితో మోదాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బండరాళ్లతో మోదడంతో అక్కడిక్కడే సోమరాజు మృతి చెందాడు.
ఆ తర్వాత గౌతంకుమార్తో కలిసి కనకదుర్గాదేవి విశాఖపట్నం పారిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన జరిగిన రోజే సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అదే రోజు తన కుమారుడు కనిపించడం లేదని సోమరాజు తండ్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో హతుడు సోమరాజుగా పోలీసులు గుర్తించారు.
అప్పటికే పరారైన కనకదుర్గాదేవి, గౌతంకుమార్లే హత్య కేసులో నిందితులని పోలీసులు నిర్ధారించుకున్నారు. కాగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను ఆరాంఘర్ చౌరస్తాలో శుక్రవారం మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించడంతో సోమరాజును హత్య చేసినట్లు అంగీకరించారు. హత్యకు సహకరించిన మరో నిందితుడు గోపాల్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.