విషాదం: సినిమాకు తీసుకెళ్లలేదని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తనను సినిమాకు తీసుకెళ్లలేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి శాంతినగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాంతినగర్కు చెందిన యాదమ్మ(28) భర్త 8 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో అక్కడే కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది.
అయితే రెండు సంవత్సరాల క్రితం ఆమెకు యాదయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ ఆనాటి నుంచి సహజీవనం చేస్తున్నారు. రెండు నెలల క్రితం గచ్చిబౌలిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు.

యాదమ్మను సాయంత్రం సినిమాకు తీసుకెళ్లానని చెప్పి శనివారం ఉదయం యాదయ్య ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుంది.
ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పక్కనే గుడిసెలో ఉంటున్న యాదమ్మ తల్లి వచ్చి పిలువగా యాదమ్మ తలుపులు తీయలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి చూసేసరికి ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది యాదమ్మ. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications