మరొకరితో చనువు: అనుమానించాడని రెండో భర్తను చంపేసింది
చిత్తూరు: భర్త వేధింపులు భరించలేక సహనం కోల్పోయిన ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన చిత్తూరు అంబేద్కర్నగర్లో సోమవారం జరిగింది. డీఎస్పీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరుకు చెందిన శ్రీనివాసులు(47) బంగారుపాళ్యం మండలం మొగిలికి చెందిన లక్ష్మి ప్రేమించుకున్నారు.
అయితే, శ్రీనివాసులు లారీ క్లీనర్గా పని చేస్తున్నాడన్న కారణంతో ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. కొద్ది రోజులకు లక్ష్మి భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో లక్ష్మి శ్రీనివాసులును రెండో పెళ్లి చేసుకుంది. ఇదంతా 22 ఏళ్ల క్రితం విషయం. ప్రస్తుతం శ్రీనివాసులు సొంతంగా లారీ కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. కాగా వీరికి 16 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే, గత కొంత కాలంగా భార్య ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో శ్రీనివాసులు లక్ష్మిని అనుమానించి వేధించసాగాడు. ఆదివారం రాత్రి పూటుగా మద్యం తాగి వచ్చిన శ్రీనివాసులు మళ్లీ ఈ విషయమై భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన లక్ష్మి ఇంట్లోని సుత్తితో భర్త తలపై బలంగా కొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు.
ఆ తర్వాత ఆందోళన చెందిన ఆమె 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. దీంతో డీఎస్పీ సుబ్బారావు, టూటౌన్ సీఐ వెంకటప్ప మృతదేహాన్ని పరిశీలించి లక్ష్మిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు.