వివాహేతర బంధం: దాంపత్య సుఖానికి పనికి రాడని భర్త హత్య
విశాఖపట్నం: జిల్లాలోని ఎలమంచిలి పట్టణంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, దాంపత్య సుఖానికి పనికిరాడన్న కోపంతో భర్తను హత్య చేసింది. మొదట తన భర్తది సహజ మరణంగా పోలీసులు, కుటుంబ సభ్యులను నమ్మించి.. చివరకు దొరికిపోయింది.
శుక్రవారం నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు వివరాలను స్థానిక సీఐ కేకేవీ విజయనాథ్ శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు.
భర్తతో తరచూ గొడవ
ఎలమంచిలిలోని దిమిలి రోడ్డు ప్రాంతానికి చెందిన అతికినశెట్టి నాగేశ్వరరావు (37) కూరగాయల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి 11 ఏళ్ల క్రితం నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వీరలక్ష్మి(27)తో వివాహమైంది. భార్యాభర్త వారపు సంతలకు వెళ్లి కూరగాయల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. అయితే మూడేళ్లగా అనారోగ్య కారణాల వల్ల నాగేశ్వరరావు దాంపత్య జీవితానికి పనికిరాకుండా పోయాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
మరో యువకుడితో వివాహేతర బంధం
ఈ నేపథ్యంలో వీరలక్ష్మి.. గూండ్రుబిల్లి గ్రామానికి చెందిన అవివాహితుడైన తారక ఈశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. విద్యుత్తు మీటర్ల రీడింగ్ తీసుకుని ఉపాధి పొందుతున్న ఇతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో వీరిద్దరికి తరచూ గొడవలు జరిగేవి. దీంతో వీరలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చజెప్పి కొన్ని షరతులపై తిరిగి ఆమెను కాపురానికి రప్పించారు. ఈ మధ్యలో భార్య ప్రవర్తనతో మనస్తాపం చెందిన నాగేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు.
చనిపోయాడని చెబుతూ..
ఈ క్రమంలో మార్చి 7వ తేదీన రాత్రి నాగేశ్వరరావు ఇంటిలో మంచంపై చనిపోయి ఉన్నాడు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు తాను బాత్రూమ్కి వెళ్లడానికి లేవగా ముక్కు నుంచి రక్తం వస్తూ మంచంపై పడిపోయి ఉన్నాడని స్థానికులను, ఆర్ఎంపీ వైద్యుడిని పిలిచి వీరలక్ష్మి చూపించింది. వారంతా అతను చనిపోయాడని చెప్పారు.
కాల్ డేటాతో పట్టేశారు
అయితే మెడపై తాడుతో గట్టిగా నొక్కిన గాయాలు ఉండటం వల్ల మృతుడి సోదరుడు రాము పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఫోన్ నంబరు అడగ్గా, వీరలక్ష్మి తన అమ్మ నంబరు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కాల్ డేటా సేకరించగా ఆరోజు రాత్రి 12 గంటల నుంచి 45 నిమిషాల పాటు గూండ్రుబిల్లిలో ఉన్న ప్రియుడు ఈశ్వరరావుతో మాట్లాడినట్లు తేలింది. అంతేగాక, పోస్టుమార్టం రిపోర్టులోనూ హత్యగా తేలింది. దీంతో వీరలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
హత్య చేసిందిలా..
నిందితురాలు వీరలక్ష్మి చెప్పిన వివరాల ప్రకారం.. మార్చి7న రాత్రి చిత్తుగా మద్యం తాగి వచ్చిన నాగేశ్వరరావు భార్యను శారీరకంగా కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆమె గొడవ పడి ఇంట్లో ఉన్న నిద్రమాత్రలు నీటిలో కలుపుకొని తాగడానికి ప్రయత్నించింది. ‘నా వల్లే కదా నీకు ఈ ఇబ్బందులు, నేనే తాగేస్తా' అని నిద్రమాత్రలు కలిపిన నీళ్లను తానే తాగేశాడు. ఆ తర్వాత మళ్లీ బయటికి వెళ్లి మద్యం తాగి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఇద్దరికి గొడవ జరగడంతో అమెను స్వల్పంగా కొట్టాడు. ఈమె తిరిగి నెట్టడంతో పక్కనున్న కప్బోర్డుపై ముక్కుకి దెబ్బతగిలింది. మద్యం, నిద్రమాత్రల మత్తులో అతడు మంచపై నిద్రపోగా.. తాడుతో వీరలక్ష్మి అతడి పీక నులిమింది. ఇంకా బతికున్నాడేమోనని చేతులతో ముక్కు, నోరు గట్టినా నొక్కిపెట్టింది. కాగా, భర్తను ఎలా హతమార్చింది వీఆర్ఓ సమక్షంలో ఆమె ఇంటిలో డెమో చేసి తమకు చూపించిందని సీఐ వివరించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు ఆమెకు రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు.