అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ఉరేసి చంపిన భార్య
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఓ మహిళ అత్యంత దారుణానికి పాల్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను మహిళ ఉరి వేసి చంపింది. విశాఖపట్నం జిల్లాలో కె.కోటపాడు మండలం మర్రివలస గ్రామానికి చెందిన కొండమమ అలియాస్ దొంగు దుర్గాలమ్మ తన భర్త నిద్రపోతుండగా ఆయన మెడకు కేబుల్ వైరు బిగించి చంపింది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కొండమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ప్రమాదంలో దంపతుల మృతి
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెం దగ్గర వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొంది. ఈ సంఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులు విజయవాడ వాసులని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి లారీని స్వాధీనం చేసుకున్నారు.
పాము కాటుతో ఇద్దరు మృతి
ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులకు పాము కాటు వేసిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఉరవకొండలో జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో ఉరవకొండలో విషాదం అలముకుంది.