ఫిర్యాదు చేసేందుకు వచ్చి పిఎస్లో యువతి ప్రసవం: యువకుడిపై కేసు
మహబూబ్నగర్: జిల్లాలోని బాలానగర్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఓ యువతి ప్రసవించింది. నిండు గర్భిణి అయిన ఆమె ప్రేమించి మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చింది. కాసేపటికే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆమె ప్రసవించింది. కాగా, పుట్టిన శిశువు మృతి చెందింది. పోలీసులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
స్వైన్ ఫ్లూతో 8 నెలల బాలుడు మృతి
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ సోకి చికిత్స పొందుతూ బుధవారం 8నెలల బాలుడు మృతి చెందాడు. కాగా, బుధవారం 21 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో మొత్తం 63 మంది స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతున్నారు.
యువతిని మోసం చేసిన యువకుడిపై అట్రాసిటీ కేసు
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని శారీరకంగా లోబర్చుకుని.. పెళ్లిమాట ఎత్తేసరికి దాటవేస్తున్న ఓ తెలుగుదేశం పార్టీ హైదర్నగర్ డివిజన్ నాయకురాలి కుమారుడు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అనుచరుడు నాగేంద్రబాబుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
పలు మీడియాల్లో వచ్చిన కథనాల ప్రకారం.. గత నెలలో నగరంలోని కూకట్పల్లి శంషీగూడ ఇందిరాహిల్స్కు చెందిన యువతి(22)ని సాయిచరణ్కాలనీకి చెందిన టీడీపీ నాయకురాలు లక్ష్మి కుమారుడు నాగేంద్రబాబు ప్రేమ పేరుతో నమ్మించాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం నాగేంద్రబాబుకు చెప్పడంతో ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద అబార్షన్ చేయించాడు.
ఆ తర్వాత తనను తనను వివాహం చేసుకోవాలని కోరగా.. అందుకు నాగేంద్రబాబు నిరాకరిస్తున్నాడని బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్తోపాటు కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని కూకట్పల్లి ఏసీపీ సంజీవ్రావును ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశించగా.. ఏసీపీ నిందితుడిని అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించారు.
పిల్లలు పుట్టడం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం పట్టణంలోని రామకృష్ణకాలనీలో బుధవారం చోటు చేసుకుంది.