యువతికి బెదిరింపు: చితకబాది పెళ్లి చేసుకున్నాడు
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి (17) కృష్ణానగర్లో తన తల్లిదండ్రులతోపాటు నివాసముంటోంది. ఆమె భాగ్యలక్ష్మికాలనీలోని అరటి మొక్కల పెంపకం కేంద్రంలో పనిచేస్తోంది. అక్కడే పనిచేసే రొడామిస్త్రీనగర్కు చెందిన తిరుపతి కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. అంతేగాక తనను వివాహం చేసుకోకపోతే యాసిడ్ పోస్తానని ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.
ఆదివారం బాలిక పనికి వెళ్తుండగా తిరుపతి, మరో ఇద్దరు యువకులతో వచ్చి ఆమెను అడ్డగించాడు. బైకుపై తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆమె నిరాకరించింది. దీంతో తిరుపతి ఆమెను చితకబాది తన వెంట బలవంతంగా తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి తిరుపతి.. యువతి ఇంటికి ఫోన్ చేసి మీ కూతురును పెళ్లి చేసుకున్నాననీ, ఇక ఆమె మీ ఇంటికి రాదని చెప్పాడు.
దీంతో ఆందోళనకు గురైన యువతి తల్లిదండ్రులు బంధువులతో కలిసి తిరుపతి ఇంటికి వెళ్లి చూడగా అక్కడ యువతి లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మరో ఇంట్లో తిరుపతితో బాలిక ఉన్నట్లు గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తిరుపతితోపాటు అతడికి సహకరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.