బంధువని ట్యూషన్కి పంపితే ఏడాదిపాటు రేప్: ముఖం చాటేశాడు
చిత్తూరు: సమీప బంధువైన ఓ యువతి(16)పై ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఏడాదిపాటు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే యువతిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, ఈ విషయంపై బాధితురాలి కుటుంబసభ్యులు నిలదీస్తే వారికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శ్రీకాళహస్తి మండలానికి చెందిన సదరు యువతి గత ఏడాది 10వ తరగతి పూర్తిచేసింది. ప్రస్తుతం పశ్చిమ మండలాల్లోని ఓ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పదో తరగతి చదివేటప్పుడు తమ సమీప బంధువు వద్దకు ట్యూషన్కు వెళ్లేది. ఆ సమయంలో అతడు లైంగిక వేధింపులకు దిగడంతో ట్యూషన్ మానేసింది.
కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. లైంగిక వేధింపుల విషయం వారికి చెప్పలేకపోయింది. మళ్లీ అతడి వద్దకే ట్యూషన్కు పంపడంతో ఈసారి ప్రేమిస్తున్నానని నమ్మించి, అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే 'నిన్ను చంపి నేనూ చచ్చిపోతా' అని బెదిరించాడు. భయపడ్డ ఆ యువతి ఈ విషయం ఎవరికీ చెప్పక పోవడంతో మరింత రెచ్చిపోయాడు.
10వ తరగతి పూర్తయ్యాక గురుకుల పాఠశాలలో ఆమె ఇంటర్ చేరింది. అయినా వదలని ఆ మృగాడు జులై 13వ తేదీన కళాశాలకు వద్దకు వెళ్లాడు. తాను సమీప బంధువునని.. యువతికు అనారోగ్యంగా ఉందని ఇంటికి తీసుకెళ్లాలని అక్కడి అధికారులను నమ్మించాడు. దీంతో వారు ఆమెను అతడి వెంట పంపారు. రాత్రికి ఆ యువతిని రేణిగుంటలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత తాను క్షేమంగా ఇంటికి చేరినట్లు కళాశాల వారికి ఫోన్ చేయించాడు. మరుసటి రోజు ఆ యువతిను శ్రీకాళహస్తికి తీసుకొచ్చాడు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలోని తమ బంధువుల ఇంట్లో బంధించి, యువతిపై అత్యాచారం చేశాడు. దీనికి సమీప బంధువైన ఓ మహిళ కూడా సహకరించినట్లు తెలిసింది.
మరోవైపు యువతి కోసం ఆమె తల్లి కళాశాలకు ఫోన్ చేయడంతో.. సమీప బంధువు తీసుకెళ్లిన విషయాన్ని అధికారులు చెప్పారు. ఆ యువతి తల్లి వెంటనే అతడి కుటుంబీకులను నిలదీశారు. దీంతో వారు రెండ్రోజుల కిందట యువతిలను ఇంటికి పంపేశారు. తమ బిడ్డ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. పట్టీపట్టనట్లు ఉండిపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కొందరు పెద్దలు అడ్డుకున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో కళాశాలకు వెళ్లలేక.. ఇంటి నుంచి బయటకు రాలేక ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కాగా, ప్రభుత్వ అధికారులైనా స్పందించి ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుని.. ఆమె చదువు కొనసాగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. తమ కూతురుకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి వేడుకుంటోంది.