జగన్ పార్టీ యువనేత దారుణ హత్య: అమ్మాయిని వేధించొద్దన్నందుకే..
చిత్తూరు: జిల్లాలోని పెద్ద మండ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ హుసేన్బేగ్ కుమారుడు సత్తార్బేగ్ (35) కార్పెంటర్గా పనిచేస్తుంటారు.
అంతేగాక, ఆయన మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్గా కూడా కొనసాగుతున్నారు. అతని బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణం నడుపుతున్నాడు. ఇమ్రాన్ దగ్గరి బంధువు కుమార్తె కాలేజీకి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అతడి తమ్ముడు విష్ణు, మరో యువకుడు కోతిమణి కలిసి వేధించేవారు.
విషయం తెలిసిన ఇమ్రాన్ పలుమార్లు వారిని మందలించాడు. కక్ష పెంచుకున్న యువకులు మంగళవారం మద్యం తాగి ఇమ్రాన్పై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. దీంతో ఇమ్రాన్ తన బావమరిది సత్తార్ను తీసుకుని యువకులను ప్రశ్నించేందుకు వెళ్లాడు. ఎందుకిలా చేశారంటూ సత్తార్ వారిని ప్రశ్నించగా వారు సత్తార్పై దాడి చేసి కత్తితో చాతీపై పొడిచారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.
వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సత్తార్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతునికి భార్య షాహీనా, ఇద్దరు కుమారులున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.