పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!
ఏపీకి జీవనాడిగా ప్రభుత్వం చెబుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు (Polavaram Project) లోపాల మయంగా మారిందని, ఈ లోపాల కారణంగా ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతుందని ఆరోపిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. పోలవరంలో లోపాల కారణంగా డ్యామ్ భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆరోపిస్తున్న ఆయన.. ఇవాళ ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టులో స్వయంగా తన వాదన వినిపించబోతున్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు .. అనంతరం జగన్ సర్కార్ లో నిఘా పరికరాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై రెండుసార్లు సస్పెండ్ కూడా అయ్యారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఈ కేసులో విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత రిటైర్ అయ్యారు. అనంతరం తిరిగి చంద్రబాబు ప్రభుత్వంలో సెంటర్ ఫర్ లిబర్టీ తరఫున జనంలోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పోలవరం ప్రాజెక్టులో లోపాలపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాను దాఖలు చేసిన కేసును స్వయంగా వాదించుకునేందుకు ఏబీవీ సిద్దం కావడం విశేషం.

పోలవరం నిర్మాణ లోపాల మీద హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం ఇవాళ చీఫ్ జస్టిస్ ముందుకు వాదనలకు రాబోతోంది. ఈ కేసులో ఏబీవీ స్వయంగా హాజరైన వాదనలు వినిపించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా తప్పులు జరిగాయని, వాటి మూలంగా డ్యాంకి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఆదేశించమని కోర్టును ఏబీవీ కోరుతున్నారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ లిబర్టీలో ఆయన సహచరుడు నల్లమోతు చక్రవర్తి ట్వీట్ చేశారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ప్రభుత్వానికి కూడా చాలా కీలకంగా మారే అవకాశాలున్నాయి.














Click it and Unblock the Notifications