ఫేస్ బుక్ లో జగన్ పై అభ్యంతరకర పోస్టు...యువకుడిపై కేసు నమోదు
కృష్ణా జిల్లా: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే అరెస్ట్ లు తప్పవని తెలిసికూడా కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలను ఆపడం లేదు. టెక్నాలజీ మీద అవగాహన లేకో బరితెగింపో తెలియదు కానీ ఇలా ప్రముఖ వ్యక్తులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు...అడ్డంగా బుక్కైపోతున్నారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సోషల్ మీడియాలో ఇలా అభ్యంతరకపోస్టులు చేసిన ఒక వ్యక్తిపై కేసు నమోదైంది.
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన పరుచూరి సురేశ్ కుమార్ జగన్పై ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడు. దీనిని గమనించిన పామర్రు వైసీపీ ఇన్చార్జ్ అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫేస్బుక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి పూర్తి వివరాలు సేకరించారు. త్వరలోనే సురేశ్ను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారని ఫిర్యాదుదారుడు తెలిపాడు. అయితే వైసీపీ చీఫ్ జగన్ కు సంబంధించి సురేష్ అనే వ్యక్తి ఇలా పలు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదుదారుడు కంప్లయింట్లో పేర్కొన్నట్లు తెలిసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు.
అయితే ఈ సందర్భంలో పోలీసుల హెచ్చరిక ఇది...ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సోషల్ పోస్టు చేయరాదు.అలాంటి వాటిని పోస్టు చేసినా, ఫార్వర్డ్ చేసినా వాట్సాప్ అయితే గ్రూప్ అడ్మిన్దే బాధ్యత. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలపై ఐటీ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసులు నమోదవుతాయి. ఫేస్ బుక్ ,వాట్సప్ల్లో అభ్యంతర మెసేజ్లపై ఇండియన్ పీనల్ కోడ్ 505 1(బీ) ఐటీ చట్టం 153, 34, 67 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయొచ్చు. సామాజిక మాధ్యమాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ది చెందుతున్నదశలో ఇలాంటి తప్పులు చేసి ఇబ్బందులు పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.