కొట్టిపారేయలేం: ఏ-1గా బాబు?, మూడో చార్జిషీటుకు సిద్దమైన ఏసీబీ!
హైదరాబాద్: అనూహ్యంగా మళ్లీ వేగం పుంజుకున్న ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఏపీ సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. కేసులో మూడో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్దమైన ఏసీబీ.. ఇందులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం వ్యవహారంలో అంతిమంగా లబ్ది పొందే అవకాశం ఉన్నది చంద్రబాబుకే కాబట్టి.. ఆయన్ను ఏ-1గా చేర్చే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు న్యాయ నిపుణులు.
Recommended Video


ఏసీబీ వద్ద ఆధారాలు:
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అందజేయడానికి తీసుకెళ్లిన రూ.50లక్షలపై ఏసీబీకి ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ ద్వారా ఏపీకి చెందిన ఓ మంత్రి, టీఆర్ఎస్ లో చేరిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఈ డబ్బును సమకూర్చినట్టు ఏసీబీ గుర్తించిందని సమాచారం. తాజాగా దాఖలు చేయబోయే మూడో చార్జిషీటులో వీటిని పేర్కొనే అవకాశం ఉందంటున్నారు. ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబే అని చండీగఢ్ ఫోరెన్సిక్ విభాగం వెల్లడించడంతో.. చార్జిషీటులో ఆయన పేరు చేర్చేందుకు మరింత బలం చేకూరిందంటున్నారు.

వారంలో చార్జిషీట్:
ఏసీబీ దాఖలు చేయనున్న మూడో చార్జిషీట్ 2రోజుల్లో న్యాయశాఖ పరిశీలనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. చార్జిషీట్ దాఖలుకు సంబంధించి ఇప్పటికీ సాంకేతికపరమైన ఆధారాలన్ని సేకరించినట్టుగా సమాచారం. పూర్తి వివరాలతో వచ్చే వారం ఈ చార్జిషీటును దాఖలు చేస్తారని చెబుతున్నారు. అయితే ఇదే తుది చార్జిషీట్ అని చెప్పలేమని సీనియర్ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం.

మళ్లీ సమావేశమైన ఏసీబీ:
సీఎం కేసీఆర్ తో సమావేశం అనంతరం ఏసీబీ పలుమార్లు దీనిపై సమావేశమైనట్టు తెలుస్తోంది. చివరి రెండు చార్జిషీట్లలోని అంశాలను మూడో చార్జిషీట్ లో సవరించబోతున్నట్టు చెబుతున్నారు. అలాగే అప్రూవర్ గా మారుతానని సుప్రీంకోర్టులో జెరూసలెం మత్తయ్య పిటిషన్ దాఖలు చేయడంతో.. అతన్ని మరోసారి విచారించాలా? వద్దా అన్న యోచనలో ఉంది ఏసీబీ. ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది.

చంద్రబాబును ఏ-1గా చేరుస్తారా?:
ఓటుకు నోటు కేసులో ఏ-1 చంద్రబాబే అవుతారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేయమని ప్రలోభ పెట్టడం అంతిమంగా ఆయనకే లబ్ది చేకూర్చడం కాబట్టి.. చంద్రబాబును ఏ-1గా చేర్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టడం కోసం సమకూర్చిన డబ్బు ఎవరు పంపించారు? అన్నది కేసులో ప్రధానాంశంగా మారబోతుందని మరికొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications