టెలీ హెల్త్ చుట్టూనే అచ్చెన్నాయుడు విచారణ- మూడు రోజుల కస్టడీలో ఏసీబీ తేల్చిందేంటి ?
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు కేవలం ఒక్క అంశం చుట్టూనే తిరగాల్సిన పరిస్ధితి. అందుకు కారణం విజిలెన్స్ రిపోర్ట్ కూ, ప్రభుత్వ వాదనకూ, ఏసీబీ దర్యాప్తుకు పొంతన లేకపోవడమే. రూ.151 కోట్ల మేర విజిలెన్స్ చూపిన అక్రమాల్లో అచ్చెన్నాయుడు పాత్రను నిరూపించేందుకు కేవలం ఆయన రాసిన లేఖ మాత్రమే సరిపోతుందా అంటే ఏసీబీ వద్ద సమాధానం లేదు.

ముగిసిన ఏసీబీ కస్టడీ....
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న రూ.151 కోట్ల విలువైన ఈఎస్ఐ స్కాంలో అప్పటి కార్మిక మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పాత్రను నిరూపించేందుకు మూడు రోజుల కస్టడీలో ఏసీబీ అష్టకష్టాలు పడినట్లు తెలుస్తోంది. టెలీ హెల్త్ సర్వీసెస్ కు కాంట్రాక్టు సిఫార్సు చేయడం మినహా మిగిలిన అంశాలకూ, అచ్చెన్నాయుడుకు సంబంధం లేకపోవడంతో మూడు రోజుల విచారణ పూర్తిగా ఈ ఒక్క అంశానికే పరిమితమైంది. టెలీ హెల్త్ సర్వీసెస్ కు ఎందుకు సిఫార్సు చేశారనే ప్రశ్న పదే పదే ఏసీబీ అధికారుల నుంచి రావడంతో చివరికి అచ్చెన్నాయుడు కూడా విసుక్కోవాల్సిన పరిస్ధితి.

సహకరించలేదంటున్న ఏసీబీ...
రూ.151 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అప్పటి కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు ఎవరికైనా నేరుగా లబ్ది చేశారా అంటే లేదనే సమాధానమే వస్తోంది. అచ్చెన్నాయుడు సిఫార్సుతో వైద్య పరికరాల కాంట్రాక్టు కేవలం టెలీ హెల్త్ కు మాత్రమే ఇచ్చారా అంటే అదీ లేదు. మొత్తం స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఎంతంటే కేవలం టెలీ హెల్త్ సర్వీసెస్ కు సిఫార్సు చేయడం వరకే. అటువంటప్పుడు ఆయన ఎందుకు సిఫార్సు చేశారో ప్రశ్నించడం మినహా ఏసీబీకి మరో మార్గం లేకుండా పోయింది. చివరికి అచ్చెన్నాయుడు మూడు రోజుల కస్టడీలో మనసు విప్పి చెప్పడం లేదనే సమాధానంతో ఏసీబీ ఈ విచారణను ముగించింది.

అచ్చెన్నాయుడిని ఫిక్స్ చేయడం కష్టమేనా ?
ఈఎస్ఐ స్కాంకి అచ్చెన్నాయుడే కారణమని నిర్ధారించడం దాదాపు అసాధ్యమని ప్రస్తుతం ఏసీబీ విచారణ చూస్తుంటే అర్ధమవుతూనే ఉంది. అదే సమయంలో టెలీ హెల్త్ సర్వీసెస్ కు సిఫార్సు చేశారనే కారణంతో వారికి ఇచ్చిన కాంట్రాక్టు, కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని చెప్పే ఆధారాలను కూడా ఏసీబీ సంపాదించలేకపోయింది. అసలు కొనుగోళ్లు జరిగే నాటికి అచ్చెన్నాయుడు మంత్రిగా కూడా లేరు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడును ఈ కేసులో ఫిక్స్ చేయడం ఏసీబీకి కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. అందుకే మూడు రోజుల విచారణలో తొలి రోజు మూడు గంటలు, రెండో రోజు ఐదు గంటలు, మూడో రోజు రెండున్నర గంటలు విచారించినా అంతా టెలీ హెల్త్ చుట్టూనే ఇదంతా సాగింది. వాస్తవానికి ఈఎస్ఐ స్కాంగా చెబుతున్న ఈ వ్యవహారంలో చాలా కొనుగోళ్లు జరిగాయి. డైరెక్టర్లు తమ ఇష్టారాజ్యంగా ఎంత మందికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. కానీ ఇందులో ఎక్కడా అచ్చెన్నాయుడు పాత్ర లేకపోవడంతో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపట్టిన ఏసీబీ కూడా ఇప్పుడు తలపట్టుకుంటోంది.












Click it and Unblock the Notifications