జగన్పై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి: అచ్చెన్నాయుడు
హైదరాబాద్: విద్యుత్పై ప్రతిపక్ష నేత జగన్ చేసిన విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆ విమర్శలను జగన్ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. జగన్ నాయకత్వంపై వారి ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని ఒక్కొకక్కరుగా పార్టీని వీడిపోతున్నారని ఆయన అన్నారు.
ఇప్పుడు వచ్చిన వారు రేపు ఉంటారనే నమ్మకం కూడా లేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి విలువైన సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. అంతేకాని ప్రభుత్వం యస్ అంటే... ప్రతిపక్షం నో అంటూ వెళ్లడం మంచి పద్దతి కాదని అన్నారు.
గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని తెలిపారు. పదేళ్లలో విద్యుత్ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. గతంలో ఎప్పుడు విద్యుత్ వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. పరిశ్రమలు మూతపడి నిరుద్యోగ సమస్య తలెత్తిందని గుర్తు చేశారు.
తాము అధికారంలోకి వచ్చేనాటికి ఏపీ విద్యుత్ రంగం ఉందా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నార్థకంగా చూసే పరిస్థితి ఉందని అన్నారు. వైఎస్ హయాంలో రూ.25వేల కోట్లతో విద్యుత్ను కొనుగోలు చేసినప్పటికీ ఏపీలో విద్యుత్ కొరత అలాగే ఉండేదని చెప్పారు. అప్పటి పరిస్థితుల్లో రూ.5.20 పైసలకు విద్యుత్ కొనుగోలు చేసింది నిజమే అని తెలిపారు.
విద్యుత్ విషయంలో ఈ దేశానికి ఏపీ రోల్మోడల్గా ఉండాలన్నదే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను చాలా వరకూ అధిగమించామని చెప్పారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టినందుకు అభినందించక పోగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎల్ఈడీ బల్పుల వినియోగం ద్వారా 35 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్నారు. విద్యుత్ రంగంలో అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. సోలార్ విద్యుత్లో అవినీతి జరిగిందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.