అమెరికాలో అల్లు అర్జున్ హవా: ప్రతిష్ఠాత్మక ర్యాలీకి సారథ్యం: గ్రాండ్ మార్షల్ హోదా
అమరావతి: టాలీవుడ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం లభించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అమెరికాలో నిర్వహించ తలపెట్టిన ఓ ప్రతిష్ఠాత్మక ర్యాలీకి ఆయన సారథ్యాన్ని వహించనున్నారు. ఆగస్టులో న్యూయార్క్లో ఈ ర్యాలీ ఏర్పాటు కానుంది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మన్హట్టన్లల్లో నివసించే భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించనుంది. అల్లు అర్జున్తో పాటు ప్రఖ్యాత గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు ఇందులో పాల్గొననున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నాలుగో పరేడ్ కౌన్సిల్ భేటీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సెలెబ్రిటీలతో కూడిన జాబితాను విడుదల చేశారు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ జాబితాలో ఉన్నారు.
ఈ ర్యాలీలో వేలాదిమంది ప్రవాస భారతీయులు పాల్గనబోతోన్నట్లు అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల రెండు, మూడేళ్లుగా దీన్ని నిర్వహించట్లేదు. ఇప్పుడా పరిస్థితులు లేకపోవడం వల్ల మరింత గ్రాండ్గా ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. మన్హట్టన్లోని మ్యాడిసన్ అవెన్యూ మీదుగా ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనికి గ్రాండ్ మార్షల్గా అల్లు అర్జున్ వ్యవహరిస్తారని తెలిపారు.
అల్లు అర్జున్, శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ వంటి సెలెబ్రిటీలు ఇందులో పాల్గొనడానికి అంగీకరించారని అంకుర్ వైద్య చెప్పారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇండియా డే పరేడ్కు అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్గా వ్యవహరిస్తారని అన్నారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ తరువాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ అటు ఓవర్సీస్లో భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రెండు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసింది.