సుజన శనిలా దాపురించాడు, చంద్రబాబు ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటా: శివాజీ
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షులు, నటుడు శివాజీ గురువారం మండిపడ్డారు. అంతర్జాతీయ బ్యాంకు స్కాంలో ఇరుక్కున్న కేంద్రమంత్రి ఏపీ భవిష్యత్తుకు శనిలా దాపురించాడన్నారు.
ఆయన ఆ వ్యాఖ్యలను కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరిని ఉద్దేశించి అన్నారు. ఏపీకి హోదా విషయమై సుజన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
టిడిపి నేతలు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారన్నారు. కేంద్రమంత్రి సుజనా చెప్పే లెక్కలు ఆయనకైనా అర్ధమయ్యాయా? అని ప్రశ్నించారు. ఆయన చెప్పినట్టే ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వస్తాయనుకున్నా, ఈ నిధుల వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని నిలదీశారు.
కేంద్రం ఎక్కువ డబ్బులిస్తామంటోందని చెబుతున్నారని, ఎక్కువ డబ్బలిస్తామంటోందని సుజనా చెబుతున్నారని, ఆ నిధుల వల్ల ప్రజలకు నేరుగా జరిగే మేలు ఏమీ ఉండదన్నారు. కేంద్రం ఇచ్చే రాయతీలు, నిధుల వల్ల సుజనాకే ఎక్కవ మేలు జరుగుతున్నట్టుందన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దన్నారు. టిడిపి నేతల ప్రవర్తన చూస్తుంటే రెండు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత తాము పోరాడామని చెప్పుకునేలా కనిపిస్తోందన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడేలా కనబడడం లేదన్నారు.
బ్యాంకుల స్కాముపై ఉన్నంత అవగాహన ఆంధ్రప్రదేశ్ సమస్యలు, లాభాలపై సుజనకు ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. ప్యాకేజీకి అంగీకరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. సుజనాని కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే చంద్రబాబును కూడా ఎవరూ నమ్మే అవకాశం ఉండదన్నారు.