ప్రధాని ప్రసంగం విన్నాక బాధేసింది, ఈయన ఆ మోడీ కాదు, చిత్తుగా ఓడించాలి: శివాజీ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు అవినీతిపరులను ఇష్టపడుతున్నారని చెబుతూ ప్రముఖ నటుడు శివాజీ తన సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన రెండు నిమిషాలకు పైగా ఉన్న ఓ వీడియోను ఉంచారు. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో మోడీ బళ్లారిలో పర్యటించి కాంగ్రెస్ పైన విమర్శలు గుప్పించారు.
జనసేన పార్టీ వ్యూహకర్త: పీకేలా బీజేపీకి పని చేశారా, ఎవరీ దేవ్?
కర్నాటకలో బీజేపీ రావడం ఖాయమని మోడీ అన్నారు. దీనిపై శివాజీ స్పందించారు. మోడీ ప్రసంగం వింటుంటే తనకు చాలా బాధ వేసిందని, చాలా చిలుకపలుకలు పలికారన్నారు. దక్షిణ, ఉత్తర భారత దేశాలను వేరు చేయాలని కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారని, దక్షిణ భారత దేశానికి గొప్ప పదవులు ఇచ్చామని మోడీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
2014లో మోడీ ఇతను కాదు
వాస్తవంగా దక్షిణ భారతదేశానికి అంత గొప్ప పదవులు ఏమీ ఇవ్వలేదని, అన్యాయం జరుగుతూనే ఉందని శివాజీ అన్నారు. 2014లో దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పిన నాటి మోడీ ఈయన కాదన్నారు. బళ్లారి ప్రాంతంలో అవినీతిపరులైన ఎనిమిది మందికి బీజేపీ టికెట్లు ఇచ్చిందన్నారు. ఆనాటి మోడీ అయి ఉంటే వారికి టిక్కెట్లు ఇచ్చి ఉండేవారు కాదన్నారు. ఇదంతా చూస్తుంటే అర్థమైంది ఏమంటే.. దేశంలో నీతి అనే దానికి తావు లేదన్నారు.
తెలుగు వాళ్ల గురించి మాట్లాడతారనుకున్నా
బళ్లారి ప్రాంతంలోని తెలుగు వాళ్ల గురించి ఒక్క మాట అయినా మోడీ మాట్లాడతారనుకున్నానని, కానీ మాట్లాడలేదని శివాజీ అన్నారు. దక్షిణ, ఉత్తర భారతదేశాలను విడగొడుతున్నారని మోడీ అన్నారని, అలా విడగొట్టే ప్రయత్నాలు సాక్షాత్తూ మోడీయే చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ, ఉత్తర భారతదేశాలను విడగొట్టేందుకు ఆజ్యం పోస్తోంది మోడీయేనని, అది మీ ఇష్టమన్నారు.
బీజేపీని చిత్తుగా ఓడించండి
ఈ దేశంలో నీతి, చట్టాలు అన్నీ చచ్చిపోయాయని శివాజీ అన్నారు. ఈ దేశంలో న్యాయానికి, ఓటుకు విలువ లేదన్నారు. కర్ణాటకలో ఉన్న ప్రజలు గమనించాలని, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఓడిపోతే తప్ప ఈ దేశం, దక్షిణ భారత దేశం బాగుపడదన్నారు. కర్ణాటకలో ఉన్న తెలుగువాళ్లందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఆ పార్టీని ఓడించాలన్నారు. దక్షిణ భారత దేశం సత్తా చాటాలన్నారు.
నేడు ఏపీకి, రేపు తెలంగాణ, కర్నాటకకు అన్యాయం
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, రేపు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని శివాజీ హెచ్చరించారు. ఆ రోజు మనమంతా ఎవరికి చెప్పుకుంటామని, మనం మనం సాయం చేసుకోవాలని, దక్షిణ భారతదేశమంటే ఏమిటో మోడీకి చూపిద్దామన్నారు. మోడీ, అమిత్ షాలు శాశ్వతంగా శాశ్వతంగా పదవిలో ఉండాలనుకుంటున్నారని విమర్శించారు.