రోజా వాదన, చంద్రబాబుపై నటి కవిత అసంతృప్తి: జగన్కు ఛాన్స్
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడేందుకు ప్రముఖ నటి, తెలుగుదేశం పార్టీ నేత కవిత అవకాశమిస్తున్నారు! ఆమె టిడిపి అధిష్టానం పైన తన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్నాళ్లుగా ఏపీలో వైసిపి నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలు టిడిపిలో చేరుతున్న విషయం తెలిసిందే. చేరికల పైన వైసిపి నిప్పులు చెరుగుతోంది. అసలు తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని రోజా వంటి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
తెరాసలోకి..? కేసీఆర్ భేష్: చంద్రబాబుపై నటి కవిత అసంతృప్తి!
ఇదే సమయంలో టిడిపి నాయకురాలైన నటి కవిత అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఆమె సోమవారం నాడు గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కులో నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టిడిపి అధిష్టానం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చినప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని ఆమె చంద్రబాబు పైన పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారం సమయంలో, పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ధర్నా జరిగినా వెంటనే తనకు ఫోన్లు చేసేవారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పిలవడమే మానేశారన్నారు. ఎన్నో ఏళ్లు పార్టీకి సేవలు అందించిన తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కవిత తెరాసలో చేరవచ్చుననే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే.