ఏపీలో ఫేక్ లీడర్లు గొంతు చించుకుంటున్నారు- వారిని నమ్మొద్దు: నటి పూనమ్ కౌర్
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు రెండోరోజూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.
మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

అటు తెలుగుదేశం పార్టీ కూడా వలంటీర్లను లక్ష్యంగా చేసుకుంది. అమరావతిలో ఇటీవలే నిర్వహించిన పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. వలంటీర్లపై ఆరోపణలు గుప్పించారు. డేటా చోరీకి పాల్పడుతోన్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు మంత్రులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎదురుదాడికి దిగారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు నేతలు పవన్ కల్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు. వలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
దీనిపై తాజాగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ స్పందించారు. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు పరోక్షంగా చురకలు అంటించారు. ఏపీలో నకలీ నాయకులు తిరుగుతున్నారంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్- గతంలో వినేష్ ఫొగట్, సాక్షిమలిక్ చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు.
The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023
ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతోందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారని పూనమ్ కౌర్ అన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే వారు మహిళా రెజర్ల కోసం ఒక్క మాట కూడా మాట్లాడ లేదని గుర్తు చేశారు.
తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని భావించినప్పుడే ఆ నకిలీ నాయకులు రోడ్ల మీదికి వస్తోన్నారంటూ పూనమ్ కౌర్ చెప్పారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చేసే నకిలీ నాయకుల పట్ల జాగ్రత్త వహించండి అంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె కొద్దిసేపటి కిందట ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications