గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటాను దక్కించుకున్న అదానీ పోర్ట్స్
అమరావతి: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు పూర్తి యాజమాన్య హక్కులు అదానీ పోర్ట్స్ సంస్థకు దక్కాయి. పోర్టులో పెట్టుబడులను అదానీ గ్రూప్ 100 శాతానికి పెంచుకుంది. 2020లో 75 శాతం వాటాను కొనుగోలు చేసిన ఈ సంస్థ.. తాజాగా, విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి మరో 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ 25 శాతం వాటా విలువ రూ. 2,800 కోట్లుగా ఓ ప్రకటనలో అదానీ పోర్ట్స్ సంస్థ వెల్లడించింది.
కృష్ణపట్నం పోర్టు హక్కులు అదానీకే
ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టు యాజమాన్య హక్కులు అదానీ పోర్ట్స్ కు 100 శాతం బదిలీ కానున్నాయి. 2021-21లో పోర్టు మొత్తం విలువ రూ. 13,675 కోట్లు ఉన్నట్లుగా అదానీ పోర్ట్స్ తెలిపింది. ప్రస్తుతం హ్యాండ్లింగ్ సామర్థ్యం 64 మిలియన్ టన్నులుగా ఉందని, 2025 నాటికి దీన్ని 200 నుంచి 300 మిలియన్ టన్నులకు పెంచేందుకు ప్రయత్నిస్తామని అదానీ సంస్థ తెలిపింది.
గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కృష్ణపట్నం
ఇక ఈ పోర్టును గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని అదానీ పోర్ట్స్ పేర్కొంది. సరుకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా కృష్ణట్నం పోర్టును కొనుగోలు చేసినట్లు అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు. ఈ పోర్టు సామర్థ్యాన్ని 50 కోట్ల టన్నులకు విస్తరించే అవకాశం ఉందన్నారు. అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ ఇటీవే గంగవరం పోర్టులో కూడా మెజార్టీ వాటాదారుగా మారిన విషయం తెలిసిందే.
రూ. 1325 కోట్ల నికర లాభాం ఆర్జించనున్న కృష్ణపట్నం పోర్టు
కాగా, కృష్ణపట్నం పోర్ట్ ఒక డీప్ వాటర్ నౌకాశ్రయం. ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్టు 3.8 కోట్ల టన్నుల సరుకు రవాణా చేసి రూ. 1840 కోట్ల ఆదాయాన్ని, రూ. 1325 కోట్ల నికర లాభాన్ని ఆర్జించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అదానీ గ్రూప్ దేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న విషయం తెలిసిందే.