తిరుమలలో 25 రోజుల దివ్య ప్రబంధం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. మంగళవారం నాడు 60,581 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,228 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.04 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
నేటితో తిరుమలలో శ్రీవారి అధ్యయయనోత్సవాలు ముగియనున్నాయి. కిందటి నెల 30వ తేదీన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ ఈ అధ్యయనోత్సవాలు ఘనంగా ఆరంభం అయ్యాయి. 25 రోజుల పాటు కొనసాగాయి. నేటితో ఇవి ముగియనున్నాయి.

సాధారణంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని దివ్యప్రబంధ అధ్యయనంగా పిలుస్తారు. 9వ శతాబ్దంలో శ్రీవారి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలు ఇవి.
వీటిపై శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తోన్నారు. ఆళ్వార్ల దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం సాగిస్తోన్నారు. ఈ అధ్యయనోత్సవాల్లోని తొలి 11 రోజులను పగల్పత్తు, మిగిలిన 10 రోజులను రాపత్తుగా వ్యవహరిస్తారు.
22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది పూర్తి చేశారు. 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర నిర్వహించారు. నేడు 25వ రోజు. తణ్ణీరముదు ఉత్సవంతో దివ్యప్రబంధ అధ్యయనం పూర్తవుతుంది.
ఈ నెల 24వ తేదీన తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు చేస్తారు. 25న సర్వ ఏకాదశి పండగను నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు. 26వ తేదీన అన్నమయ్య భవనంలో గణతంత్ర దినోత్సవం, 27న మాస శివరాత్రి చేపడతారు. 29వ తేదీన శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications