ఆదిశేషు లీలలు: రూ.120 కోట్ల అక్రమాస్తులు, 6.50 కిలోల బంగారు, వజ్రాభరణాలు
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా సహాయక అబ్కారీ కమిషనర్, అక్కడి చాగల్లు మద్యం డిపో ఇన్ఛార్జి మామిళ్లపల్లి ఆదిశేషు దిమ్మదిరిగే అక్రమాస్తులను కూడబెట్టినట్లు వెలుగు చూసింది. పొలాలు, స్థలాలు, బ్యాంకు లాకర్లలో కేజీల కొద్దీ వెండి బంగారు ఆభరణాలు, 15 దాకా ఏటీఎం కార్డులు సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా, ప్రామిసరీ నోట్లు, చెక్కులు వెలుగు చూశాయి. వీటిలో ఎక్కువ భాగం బినామీల పేర్ల మీదనే ఉన్నాయి. అక్రమార్జన ఆరోపణలపై బుధవారం విజయవాడ మొగల్రాజపురంలోని అతని నివాసం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోని బంధువుల నివాసాలపై ఏసీబీ కేంద్రీయ విభాగం డీఎస్పీ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో దాడులు జరగడం తెలిసిందే.
గురు, శుక్రవారాల్లోనూ కొనసాగిన తనిఖీల్లో ఆదిశేషు అక్రమాస్తులు భారీగా వెలుగు చూశాయి. విజయవాడ పాలిక్లినిక్ రోడ్డులోని లక్ష్మివిలాస్ బ్యాంకులోని రెండు లాకర్లను తెరవగా 6.80 కిలోల ఖరీదైన బంగారు బిస్కెట్లు, వజ్రాభరణాలు కనిపించాయి.
ఏడువారాల నగలు, కంఠాభరణాలు, ఆఖరికి బంగారు ఉగ్గుపాల గిన్నె కూడా ఉన్నాయి. దీంతో మొత్తం 7.20 కిలోల బంగారం ఇప్పటి వరకు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి వెండి, బంగారు నగలను సీజ్ చేసి ట్రెజరీలో అప్పగిస్తామన్నారు. అతని ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.50కోట్లని చెప్పారు.
గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యంత ఖరీదైన భూములు, స్థలాలు, భవనాలను నేటి మార్కెట్ విలువ ప్రకారం లెక్కిస్తే రూ.120-150 కోట్ల పైచిలుకేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క బంగారు నగల విలువే రూ.7-8 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.
ఆదిశేషు పెద్దమొత్తాల్లో కాల్మనీ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఇంట్లోను, లాకర్లలోనూ కలిపి 30 సంతకాలు పెట్టిన ఖాళీ ప్రామిసరీ నోట్లు లభించినట్లు తెలుస్తోంది. కాల్మనీ కింద రూ.5-7 కోట్లు రుణాలు ఇచ్చి ఉంటాడని అంచనా. మరో మూడు నాలుగు రోజులు సోదాలు కొనసాగనున్నాయి.