కొత్త ఎంపీలపై ఏడీఆర్ సంచలన రిపోర్ట్ ... టాప్ టూ ఆస్తులు, అప్పులు మనోళ్లవే...కేసుల్లోనూ..
దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపికైన ఎంపీలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా విశ్లేషణ నివేదికను విడుదల చేసింది. ఇందులో వీరికి సంబంధించిన అన్ని వివరాలను విశ్లేషించారు. ప్రస్తుతం వారి ఆస్తులు, అప్పులు, ఆదాయం, క్రిమినల్ కేసుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఈ నివేదికలో ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఇద్దరు ఎంపీలు రెండు వేర్వేరు అంశాల్లో టాప్ లో నిలవడం విశేషం.
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు
ఆదాయం, ఆస్తుల్లో అయోధ్య రామిరెడ్డి టాప్...
రాజ్యసభకు తాజాగా ఎన్నికైన ఎంపీల్లో ఆదాయం, ఆస్తుల పరంగా చూస్తే ఏపీ నుంచి గెలిచిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి టాప్ పొజిషన్ లో నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.2577 కోట్లు కాగా.. వార్షికాదాయం రూ.279 కోట్లుగా ఉంది. ఆస్తుల్లో రూ.396 కోట్లతో మరో ఏపీ ఎంపీ పరిమళ్ నత్వానీ రెండో స్ధానంలో నిలిచారు. మధ్యప్రదేశ్ రాజకుటుంబానికి చెందిన బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా రూ.379 కోట్లతో ఆస్తుల్లో మూడో స్ధానంలో నిలిచారు. ఆస్తుల జాబితాలో మణిపూర్ కు చెందిన బీజేపీ ఎంపీ మహారాజ శనజవోబాలీ షెంబా రూ.5.48 లక్షలతో చివరి స్ధానంలో ఉన్నారు.
అప్పుల్లో నత్వానీ టాప్....
కొత్త ఎంపీల జాబితాలో ఆస్తుల పరంగా టాప్ టూ పొజిషన్ లో నిలిచిన ఎంపీ పరిమళ్ నత్వానీ అప్పుల పరంగా మాత్రం రూ. 209 కోట్లతో టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నారు. విచిత్రంగా ఆస్తుల్లో టాప్ వన్ గా నిలిచిన మరో ఏపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అప్పుల్లో రూ.154 కోట్లతో రెండో స్ధానంలో నిలిచారు. అంటే అస్తులు, అప్పుల్లో రెండింటిలోనూ టాప్ టూ పొజిషన్ లు ఏపీ ఎంపీలకే దక్కినట్లయింది. మిగిలిన ఎంపీల అప్పులు వంద కోట్ల లోపే ఉన్నట్లు ఏడీఆర్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
Recommended Video
క్రిమినల్ కేసుల్లో 26 శాతం ఎంపీలు...
ఆస్తులు, అప్పుల పరిస్ధితి ఎలా ఉన్నా తాజాగా రాజ్యసభకు ఎంపికైన 62 మంది ఎంపీల్లో 26 శాతం అంటే 16 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. ఇందులో 11 మందిపై అయితే ఏకంగా హత్య, హత్యాయత్నం, అత్యాచారం, దోపిడీ, దొంగతనం వంటి కేసులు కూడా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో ముగ్గురు కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, వైసీపీ నుంచి ఇద్దరేసి, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, ఆర్పీఐ, ఇండిపెండెంట్ సభ్యులు ఒక్కొక్కరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.