కల్తీ మద్యం కేసు: మల్లాది విష్ణుకు బెయిల్, షరతులు
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరయింది. కల్తీ మద్యం కేసులో ఇటీవల అరెస్టైన అతనికి బెయిల్ వచ్చింది. విష్ణుతో పాటు సోదరుడు మల్లాది శ్రీనివాస రావుకు కూడా కోర్టు బెయిలు వచ్చింది.
రూ.50వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులతో విజయవాడలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. వారానికి మూడు రోజులు పోలీస్ స్టేషన్కు హాజరుకావాలని, సిట్ విచారణకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది.
కాగా, కల్తీ మద్యం కేసులో పోలీసులు కాంగ్రెసు పార్టీ నాయకుడు మల్లాది విష్ణును పదిహేను రోజుల క్రితం అరెస్టు చేశారు. నాడు.. ఈ కేసులో రెండు రోజుల పాటు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు చివరకు అరెస్టు చేసింది.
ఆయనతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి 11.20 గంటలకు అరెస్టు చేశారు. విష్ణును సిట్ పోలీసులు పన్నెండున్నర గంటల పాటు విచారించారు.
అరెస్టుకు ముందు.. స్వర్ణ బార్ లైసెన్స్దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుంరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్ర శర్మ, కెఎ లక్ష్మిని కూడా పిలిపించిన సిట్ అధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్లోని ప్రత్యేక గదిలో విష్ణుతో పాటు మిగిలిన వారిని ఎదరెదురుగా కూర్చోబెట్టి విచారించారు.
రెండు రోజుల విచారణలో భాగంగా.. తొలి రోజు బుధవారం విచారణలో చెప్పిన విషయాలనే విష్ణు రెండో రోజు కూడా చెప్పినట్లు సమాచారం. లైసెన్స్దారులు చెబుతున్న విషయాలతో పోల్చి చూస్తే విష్ణు చెప్పిన విషయాలు కొంత తేడాగా ఉన్నట్లు తెలిసంది. దీంతో విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.