2019 తరువాత చంద్రబాబుకు ఆ పిచ్చి మరీ ఎక్కువైంది..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న తొక్కిసలాట రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. జిల్లాలోని కందుకూరులో బుధవారం రాత్రి ఆయన నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన ఘటన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబును టార్గెట్ గా చేసుకున్నారు.
ఆ విషయంలో టీడీపీని మించి పోయిన క్రెడిట్ కోసం బీజేపీ: క్రెడిట్ కోసం వైసీపీతో పోటీ
వికృత విన్యాసం..
చంద్రబాబు వికృత విన్యాసంలో భాగంగా ఈ నరబలి జరిగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలంటే ఏ మాత్రం లెక్కలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వేసే ప్రతి అడుగులో, చెప్పే ప్రతి మాటలో అహంకారం కనిపిస్తోందని మండిపడ్డారు. కందుకూరు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
పబ్లిసిటీ పిచ్చికి..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి మరోసారి ఎనిమిది అమాయకులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని అందుకున్న ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించారని చెప్పారు.
ఇది కోల్డ్ బ్లెడెడ్ ప్లాన్డ్ పబ్లిసిటీ..
చంద్రబాబుకు మితిమీరిన టెక్నాలజీ పబ్లిసిటీ పిచ్చి ఉందని, అది మరీ ఎక్కువైందని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. డ్రోన్లతో షాట్స్ తీసుకుంటే జనం పెద్ద సంఖ్యలో వచ్చినట్టు కనిపించాలనే కక్కుర్తితో ఇరుకైన సందులో రోడ్ షో నిర్వహించాడని, పెద్ద రోడ్డును క్లోజ్ చేయించాడని ఆయన అన్నారు. ఇది కోల్డ్ బ్లెడెడ్ ప్లాన్డ్ పబ్లిసిటీ కోసం చేసిన యాక్సిడెంట్ గా ఆయన అభివర్ణించారు. విశాలంగా ఉన్న రోడ్డులో చంద్రబాబు సభ జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు.
పశ్చాత్తాపం లేదు..
ఇంత జరిగాక కూడా చంద్రబాబు కనీస పశ్చాత్తాపం కనిపించట్లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునేలా వ్యవహరిస్తోన్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వంపై ఆవేశంతో, ఒక ఉద్యమంలా వచ్చారని కప్పదాటు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో ఓ యజ్ఞం జరుగుతోందట..వీరు త్యాగం చేశారట. ఈ త్యాగం వృథా పోదటా.. అర్జెంట్గా చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు వచ్చారంటూ ప్రచారం చేసుకుంటోన్నాడని ఆరోపించారు.
పోలీసులపై విమర్శలా..
ఈ ఘటనను పోలీసుల వైఫల్యంగా చూపే ప్రయత్నం చంద్రబాబు చేస్తోన్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. పోలీసులను పెద్ద సంఖ్యలో పెట్టలేదని ఆరోపిస్తోన్నాడని, అదే సభను పోలీసులు అడ్డుకుని ఉంటే మళ్లీ వాళ్లపైనే విమర్శలు చేసే వాడని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు నైజమని, వారి యోగక్షేమాలను ఏ రోజు పట్టించుకోలేదని విమర్శించారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా, ఓ పార్టీకి అధ్యక్షుడిగా.. సభ్య సమాజంలో సంస్కారవంతంగా వ్యవహరించాలనే ఆలోచన ఏ మాత్రం చంద్రబాబుకు లేదని చెప్పారు.