ఏపీలో కొనసాగుతున్న ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు- 48 గంటల్లో 9 మంది బలవన్మరణం ?
ఏపీలో తాజాగా వెలువడిన ఇంటర్ మీడియట్ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పరీక్ష తప్పిన విద్యార్ధులు పలు జిల్లాల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరీక్షా ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత కూడా ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ ఆత్మహత్యల వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడిన 48 గంటల్లో 9 మంది విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తేలింది. వివిధ జిల్లాల్లో పరీక్షలు రాసిన విద్యార్ధులు తాము ఆశించిన ఫలితాలు రాకపోడంతో ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 61 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం పాసయ్యారు. మిగతా వారంతా ఫెయిలయ్యారు.

రెండు రోజుల క్రితం ఇంటర్ ఫలితాలు వెలువడగానే పలువురు విద్యార్ధులు ఉరేసుకుని, రైళ్ల కింద పడి, నీళ్లలో మునిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఫలితాలు రాగానే ఓ విద్యార్ధి శ్రీకాకుళం జిల్లాలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.అనంతరం విశాఖ జిల్లాల్లో ఓ బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే జిల్లాలో కంచరపాలెంలో ఇంటర్ సెకండియర్ ఫెయిలైన ఓ విద్యార్ధి కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చిత్తూరు జిల్లాలో ఇద్దరు, అనకాపల్లి జిల్లాలో ఒకరు, ఇలాగే ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఏడాది దేశంలోని ఐఐటీల్లో నలుగురు విద్యార్ధుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న తరుణంలో ఇంటర్ పాస్ కాలేదని వీరంతా ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా విద్యార్దుల ఆత్మహత్యలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోందని, విద్యాసంస్ధలు ఎక్కడ విఫలమవుతున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించడం విశేషం.












Click it and Unblock the Notifications