పీఆర్సీ పోరులో ట్విస్ట్-ఆత్మరక్షణలో ఆ నలుగురు-టీచర్ల పోరుపై సచివాలయంలో చర్చలు
ఏపీలో పీఆర్సీ పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. పీఆర్సీ సాధన కోసం ఉద్యోగులు మొదలుపెట్టిన పోరు తర్వాత ప్రభుత్వం సాధన సమితిలో ఉన్న నలుగురు నేతలతో చర్చించి ఒప్పించింది. అయితే దీనిపై ఉద్యోగులు రివర్స్ కావడంతో నలుగురు నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. తిరిగి ప్రభుత్వానికి సమ్మె హెచ్చరికలు చేశారు. అయితే రెండోసారి కూడా ప్రభుత్వం వారిని దారికి తెచ్చుకుంది. దీంతో ఉద్యమం ముగిసిందని భావిస్తున్న తరుణంలో టీచర్లు రివర్స్ అయ్యారు. ఇప్పుడు వారి పోరాటంతో ఉద్యోగుల నుంచి ఉద్యమ నేతలకు సెగ తలుగుతోంది.

పీఆర్సీ పోరులో ట్విస్టులు
ఏపీలో పీఆర్సీ పోరు ట్విస్టులతో వేడెక్కుతోంది. మెరుగైన పీఆర్సీ సాధన కోసమంటూ ప్రభుత్వంతో చర్చలు జరపడం, ప్రభుత్వం చెప్పిన దానికి అంగీకరించడం అలవాటుగా మార్చుకున్న నేతలకు కిందిస్దాయి ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి సెగ తప్పడం లేదు. గతంలో ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి కిందిస్దాయిలో ఉద్యోగులు అంగీకరించకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డ నేతలకు ఈసారి ఉపాధ్యాయుల రూపంలో సెగ తగులుతోంది. దీంతో ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి పేరుతో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.

టీచర్ల రివర్స్ తో ఇరకాటం
27 శాతం పీఆర్సీ, అశుతోశ్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేసే వరకూ ప్రభుత్వంతో చర్చల్లేవంటూ మిగతా సంఘాల్ని నమ్మించిన నేతలు.. ఆ తర్వాత ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో రాత్రికి రాత్రి చర్చలు జరిపి అంతా మమ అనిపించేశారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని, దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. అక్కడే సీన్ రివర్స్ అయింది. వీరితో విభేధిస్తూ టీచర్లు పీఆర్సీ సాధన సమితి నుంచి బయటికి రావడం, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలుపెట్టడంతో నేతలు ఇరకాటంలో పడ్డారు.

దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా
ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పీఆర్సీ ఫిట్ మెంట్ ఒక్క శాతం కూడా పెరగకపోయినా పీఆర్సీ సాధన సమితిలోని నేతలు సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుని సమ్మె విరమించుకోవడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు అమ్ముడుపోయారంటూ పోస్టులు వెలుస్తున్నాయి. దీంతో ఈ నలుగురు నేతల తీరుపై అన్ని ఉద్యోగసంఘాలతో పాటు ఉద్యోగులు, టీచర్లలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని ప్రభావం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా కనిపిస్తోంది. తమ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిన నేతలు తప్పుకోవాలంటూ ఉద్యోగులే పోస్టులు పెడుతున్నారు.

ఆత్మరక్షణలో ఆ నలుగురు ?
పీఆర్సీ సాధన సమితి పేరుతో ఏర్పాటైన రాష్ట్రవ్యాప్త ఉమ్మడి జేఏసీలో బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కాకర్ల వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ ప్రధాన నేతలు. ప్రభుత్వంతో చర్చలు జరిపి అవి ఫలించినట్లు చెప్పుకున్న ఈ నలుగురు నేతలకు టీచర్ల పోరుతో ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రభుత్వం వద్ద రాజీ పడ్డారన్న విమర్సల్ని తమ సంఘాల్ల ఉన్న ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల నుంచి వీరు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిని లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు రాష్ట్రంలో కొత్త జేఏసీల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నలుగురు నేతలు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది.
Recommended Video

భవిష్యత్ వ్యూహంపై చర్చ
ప్రభుత్వంతో పీఆర్సీపై చర్చలు సానుకూలంగా జరిగాయని, అందుకే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించేసిన నేతలకు ఇప్పుడు కిందిస్దాయి ఉద్యోగులు, టీచర్ల పోరుతో ఏం చేయాలో తెలియని పరిస్ధితి నెలకొంది. మరోవైపు సోషల్ మీడియాలో నలుగురు నేతల తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్దితిపై చర్చించేందుకు పీఆర్సీ సాధన సమితిని నడిపిస్తున్న నలుగురు నేతలు ఇవాళ సచివాలయంలో భేటీ అయ్యారు. టీచర్ల ఆందోళనలు, ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రభావం వంటి అంశాలపై వారు చర్చిస్తున్నారు. ఇందులో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు ఖరారు చేయబోతున్నారు. టీచర్ల పోరు మరింత పెరిగితే తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications