దారుణం: రెండో భార్యపై అనుమానం, కూతురును చంపిన తండ్రి
ఏలూరు: భార్య పైన అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురును చంపేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ కూతురు కన్నుమూసింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో శనివారం జరిగింది. ఏలూరులో తాటిమాల రవితేజ, దుర్గమ్మలు ఉంటున్నారు. వారికి కూతురు రూఫినా(5), కుమారుడు జశ్వంత్ ఉన్నారు. భార్యపై అనుమానంతో భర్త కొడుతుండేవాడు.
శనివారం కూడా భార్యతో గొడవపడిన అనంతరం కుమార్తె రూఫినాను విచక్షణ రహితంగా కొట్టాడు. ఆ చిన్నారి స్మృహ తప్పడంతో ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు రవితేజ పరారీలో ఉన్నాడు.
దుర్గమ్మ, రాజేష్లకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. అతనికి గతంలోనూ వివాహమైంది. దుర్గమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు రూఫినా(5), జశ్వంత్. తాపీ పనిచేసే రవితేజ మద్యం సేవించి, ప్రతి రోజు భార్యతో గొడవపడేవాడు. భార్యపై అనుమానంతో కొడుతుంటాడు. కూతురు రూఫినాను కూడా కొడుతుండేవాడు.
శనివారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. కూతురును విచక్షణారహితంగా కొట్టాడు. ఆ చిన్నారి స్పృహ తప్పిపడిపోగా కంగారుపడిన తల్లి, ఇతరులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వారు ఆటోలో వెళ్లారు. ఆటోలో రవితేజ కూడా వారి వెంట వచ్చాడు. కానీ అతను ఆటోలో నుంచి దూకి పరారయ్యాడు. ఆసుపత్రిలో పాపను పరిశీలించి, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
రవితేజ కూతుర్ని నాలుగు నెలల క్రితం కూడా కొట్టాడు. అప్పుడు ఆమె చేయి విరిగింది. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి, హెచ్చరించారు. కాగా, ఆటోలో నుంచి తప్పించుకున్న రవితేజ ఆ తర్వాత శనివారం అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.