పోలవరం పూర్తిచేసి...జాతికి అంకితం చేసేంతవరకు నిద్రపోను...చంద్రబాబు భావోద్వేగం
Recommended Video
విజయవాడ: ఎన్ని అడ్డంకులు వచ్చినా...పోలవరాన్ని పూర్తిచేసితీరుతా... పోలవరాన్ని జాతికి అంకితం చేసేంతవరకు నిద్రపోను...ఇదే నా జీవితాశయం అంటూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు.
ప్రకాశం బ్యారేజీ షష్ఠి పూర్తి సందర్భంగా బ్యారేజీ సమీపంలో దుర్గాఘాట్ వద్ద శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూజలు చేసిన చంద్రబాబు అనంతరం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 60 వసంతాల ప్రకాశం బ్యారేజ్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. నాడు బ్యారేజీ నిర్మాణ పనుల్లో భాగస్వాములైన సిబ్బందిని సన్మానించారు. గోదావరి నది, ప్రకాశం ఆనకట్ట, బ్యారేజీల నిర్మాణం, కాటన్దొర, ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, ఓర్ తదితరుల పాత్రను, చరిత్రను ఈ సందర్భంగా చంద్రబాబు స్మరించుకున్నారు.
కేంద్రం సహకరిస్తోంది....
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు. అయితే బిల్లులు సకాలంలో చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని, 2018 నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని తాను అనుకున్నానని చెప్పారు. కాంక్రీటు పనులు మరింత వేగం పుంజుకోవాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు.
పట్టిసీమ...రాళ్లేసేవారు
నేటి పరిస్థితుల్లో పట్టిసీమ నిర్మించుకుని ఉండకపోతే ఈ రోజు ఇక్కడ ఇలా ఈ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇక్కడ నిలబడితే జనం రాళ్లు వేసే పరిస్థితి ఉండేదని చంద్రబాబు సంచలన వ్యాఖ్యాలుచేశారు. అయితే ఎక్కడ నీళ్లుంటే అక్కడ ప్రాజెక్టులు కట్టుకోవడమే ముఖ్యమని, సాధ్యపడుతుందా లేదా ఇలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే కుదరదని చంద్రబాబు అన్నారు.
వర్షాన్ని సైతం ఒడిసిపట్టాం...
ఈ ఏడాది 12.5 శాతం వర్షపాతం తక్కువ పడిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 6.50 లక్షల పంటకుంటలు తవ్వామని గుర్తు చేశారు. అయినా వాటి ద్వారా పడిన వర్షాన్నే, ఆ వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చామని అన్నారు.
మంత్రి ఉమ మాట్లాడుతూ...
జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీకి సీఎం 2018లోనే శంకుస్థాపన చేయనున్నారన్నారు. దిగువన చోడవరం వద్ద రెండున్నర టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజి ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర జల సంఘానికి పంపినట్లు చెప్పారు. దిగువన అవనిగడ్డ సమీపంలో శ్రీకాకుళం వద్ద జీవావరణ సమతౌల్యం కోసం మరో కట్టడం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.