మీ నిర్ణయాలతో మాపై వ్యతిరేకత- స్పందించకపోతే ధర్నా- ధర్మాన బాటలో మరో వైసీపీ ఎమ్మెల్యే !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటిపోయింది. మరో 18 నెలల్లో ఎన్నికలకు సిద్ధంకావాలని సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను పరుగులు తీయిస్తున్నారు. గడప గడపకూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, చేసిన సంక్షేమాన్నివారికి వివరించాలని పదే పదే చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వంపై సహజంగా ఉండే ప్రజావ్యతిరేకతను అధిగమించవచ్చనేది ఆయన ఆలోచన. కానీ క్షేత్రస్ధాయిలో జరుగుతోంది వేరు.
గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేలకు అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని పలువురు ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే జగన్ కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు నిన్న బహిరంగసభలోనే చెప్పారు. దీనికి కారణం ప్రజలు ప్రభుత్వం తెస్తున్న సంస్కరణల్ని అర్దంచేసుకోకపోవడమే అన్నారు. ఇదే క్రమంలో ఇవాళ మరో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రజా వ్యతిరేకతకు మరో కారణం చెప్పారు.

కోనసీమ జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయరెడ్డి ఇవాళ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన అధికారుల తీరును తప్పుబట్టారు. అధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. దీని వల్లే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే తెలిపారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే ధర్నా చేస్తానని అధికారుల్ని ఎమ్మెల్యే హెచ్చరించారు.












Click it and Unblock the Notifications