ఇలా చెక్ పెట్టారు!: స్టార్ హీరోలకు చంద్రబాబు పొలిటికల్ 'పంచ్'
విజయవాడ: తెలుగుదేశం పార్టీ లేదా నారా చంద్రబాబు నాయుడు 'పొలిటికల్ గేమ్' చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు. స్టార్ హీరోలను ఉపయోగించుకోవడంపై చర్చ సాగుతోంది. టాప్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, మహేష్ బాబులను టిడిపి ఉపయోగించుకుంది.. ఉపయోగించుకుంటోంది.
తారలను ఉపయోగించుకోవడం అందరు రాజకీయ నాయకులు చేసేదే. అయితే, ఓ స్టార్ తనకు దూరమైనప్పుడు మరో నటుడిని తెరపైకి తేవడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాజకీయ చాతుర్యం ఉపయోగిస్తోందని అంటున్నారు.
టిడిపికి తొలుత జూ.ఎన్టీఆర్, 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఇప్పుడు అంతో కొంతో మహేష్ బాబు ఉపయోగపడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
2009 సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం విస్తృత ప్రచారం చేశారు. ఆ తర్వాత మూడేళ్లకు పార్టీలో వారసత్వ పోరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో జూ ఎన్టీఆర్ను టిడిపి పూర్తిగా పక్కకు పెట్టింది. లోకేష్ కోసం జూ ఎన్టీఆర్ను పక్కన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టిడిపి - బిజెపి కలిసి పోటీ చేశాయి. ఆ మిత్రపక్షానికి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. ఆయన అంతకుముందే జనసేనను స్థాపించారు. తన మద్దతు టిడిపి - బిజెపి కూటమికి ప్రకటించారు. అంతేకాదు, ప్రచారం కూడా చేశారు.

అయితే, గత కొద్దికాలంగా పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు దూరం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. హామీలను నెరవేర్చక పోవడం, బలవంతంగా భూములు తీసుకోవడంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా ప్రశ్నించారు. పవన్ సూచన మేరకు కొన్ని విషయాల్లో తగ్గినప్పటికీ... ఇప్పటికీ టిడిపి ఆయన పట్ల సానుకూలంగానే ఉంది.
అందుకు, తర్వాత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కోరుకుంటోంది. అయితే, అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అనే అనుమానం కూడా టిడిపిలో లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఒకటికి రెండుసార్లు మహేష్ బాబు పేరును తెరపైకి తీసుకు వచ్చింది.
పవన్ కళ్యాణ్కు కౌంటర్గా మహేష్ బాబు టిడిపికి మద్దతు పలుకుతారని గతంలో ఓసారి జోరుగా ప్రచారం సాగింది. అది నిజం కాదని తేలింది. ఆ తర్వాత ఇటీవలే మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో మహేష్ బావ, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఇతర టిడిపి నేతల జోరు కనిపించింది.
మహేష్ బాబుకు రాజకీయ వాసన గిట్టదు. ఆయన ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటారు. గత సార్వత్రిక ఎన్నికల్లోను తన బావ గల్లా జయదేవ్కు మద్దతుగా ప్రచారం చేస్తారని, అది టిడిపికి అనుకూలం అవుతుందని భావించారు. కానీ మహేష్ బాబు తన బావకు అనుకూలంగా ఓ ట్వీట్ పెట్టి వదిలేశారు.
అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పేరును మరోసారి తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను దత్తత తీసుకున్న గ్రామంలో పర్యటించినప్పటికీ... మహేష్ బాబు పర్యటనను టిడిపి క్యాష్ చేసుకోవాలని భావించిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications