విద్యుత్ బిల్లుపై కేంద్రానికి జగన్ షాక్: నిధులు అందాక యూటర్న్- కేసీఆర్ కు జగన్ కు తేడా అదే
విద్యుత్ ఒప్పందాల సమీక్షకు వీల్లేకుండా, కేంద్రం చెప్పిన ప్రైవేటు సంస్దలకే కాంట్రాక్టులు ఇచ్చేలా, అదీ కేంద్రం చెప్పిన రేట్లకే ఇచ్చేలా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ రూపొందించిన విద్యుత్ సంస్కరణల బిల్లుపై చివరి నిమిషంలో జగన్ వ్యూహం మార్చారు. ఏపీకి గుదిబండగా మారిన విద్యుత్ ఒప్పందాల సమీక్షకు గతంలో విశ్వప్రయత్నాలు చేసి చివరికి విద్యుత్ సంస్కరణల బిల్లుపై జగన్ మౌనం వహించడం ప్రతికూల సంకేతాలను పంపేలా ఉందని గతంలో వన్ ఇండియా జగన్ సర్కారును ప్రశ్నించింది. అయితే చివరి నిమిషంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది.
వైసీపీ హీరోలకు టాలీవుడ్ చెక్ - జగన్ తో భేటీకి గైర్హాజరు వెనుక ఏం జరిగింది ?
విద్యుత్ బిల్లుకు వ్యతిరేకమే....
2003లో తీసుకొచ్చిన విద్యుత్ చట్టంలో భారీగా మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2020 ఇప్పటికే కాక రేపుతోంది. తెలంగాణతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఈ బిల్లుపై మండిపడుతున్నాయి. వినియోగదారులతో పాటు పరిశ్రమల ప్రయోజనాలకు కూడా విఘాతం కల్పిస్తుందని ఆరోపిస్తున్నాయి. పార్లమెంటులో ఈ బిల్లును అడ్డుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వైసీపీ సర్కారు పార్లమెంటు సమావేశాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో స్పందించింది. ఈ బిల్లు తమకు ఆమోదయోగ్యం కాదని ట్రాన్స్ కో సిఎండీ కేంద్రానికి లేఖ రాశారు.
ఎందుకు వ్యతిరేకమంటే....
విద్యుత్ చట్టంలో సవరణలు డిస్కంలకు అవసరాన్ని మించి రక్షణ కల్పించేలా ఉన్నాయని, విద్యుత్ రంగ కేంద్రీకరణకు దారితీసేలా ఉన్నాయని, వీటివల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా పెరుగుతుందని ట్రాన్స్ లో సీఎండీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పీపీఏల చెల్లింపుల కోసం ఇప్పటికే ఉన్న వ్యవస్ధ సరిపోతుంది కాబట్టి కొత్తగా మరో విధానం అవసరం లేదు. అలాగే పీపీఏ వివాదాల పరిష్కారం కేంద్రం చేతుల్లో ఉండకూడదు. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ పేరిట అధికారాల కేంద్రీకృతం సరికాదు. విద్యుత్ సబ్సిడీలపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలి. ఈఆర్సీలపై నియంత్రణ కేంద్రానికి ఉంచడం సరికాదని ఈ లేఖలో ప్రభుత్వం పేర్కొంది.
నిధులు అందాక వ్యూహం మారింది..
విద్యుత్ చట్టంలో సవరణలు చేస్తూ తీసుకొస్తున్న సంస్కరణలకు ఆమోదం తెలిపిన రాష్ట్రాలకే కరోనా నిధులు ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ షరతులు విధించారు. అప్పుడు కరోనా నిధులకు విద్యుత్ సంస్కరణలతో లింకు ఎలా పెడతారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా నిలదీశారు. అయితే జగన్ మాత్రం వ్యూహాత్మక మౌనమే పాటించారు. దీంతో కేంద్రం వివిధ పద్దుల కింద గత రెండు నెలల్లో దాదాపు 8 వేల కోట్ల మేర నిధులను ఏపీకి విడుదల చేసింది. కీలక సమయంలో నిధుల రాకతో జగన్ సర్కార్ గట్టెక్కేసింది. తాజాగా అవే విద్యుత్ సంస్కరణలు తమకు ఆమోదయోగ్యం కాదంటూ కేంద్రానికి లేఖ రాసింది.
Recommended Video
కేసీఆర్ కూ జగన్ కు తేడా అదే...
విద్యుత్ సంస్కరణల చట్ట సవరణ బిల్లు ఒకటే. ఇరు రాష్ట్రాలకూ అదే వర్తిస్తుంది. కానీ బిల్లుపై సరైన సమయంలో స్పందించడం ద్వారా జగన్ కేంద్ర నిదులను రాబట్టుకుంటే, కేసీఆర్ మాత్రం ముందే స్పందించి నిధులను కోల్పోయారు. కరోనా సమయంలో కేంద్రం జగన్ సర్కారును ఆదుకుందని బహిరంగంగానే చెప్పిన కేసీఆర్.. విద్యుత్ సంస్కరణల బిల్లుపై తాను కూడా అదే పని చేసుంటే సరిపోయేదని ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు. కేంద్రం విధించిన షరతులను పాటించకుండానే జగన్ నిధులు రాబట్టుకుంటే, అదే పని చేసిన కేసీఆర్ నిధులు కోల్పోయారు.