జగన్ కు భారీ ఎదురుదెబ్బ- సీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్- కేసీఆర్ అభ్యంతరాలతో ...
ఏపీలో జగన్ సర్కారు చేపట్టిన మరో భారీ పథకానికి బ్రేక్ పడింది. తమకు భారీ మెజారిటీని కట్టబెట్టిన రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో కృష్ణాబోర్డు దానికి బ్రేక్ వేసింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శికి ఓ లేఖ రాసింది .దీంతో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మరో కీలక పథకానికి అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియకు చేరుకున్న ఈ పథకానికి కృష్ణాబోర్డు అభ్యంతరాలు చెప్పడంతో ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.
మరో రికార్డుకు జగన్ రెడీ- వారం రోజుల్లో 26778 ఉద్యోగాలు- ఆగస్టు 6 కల్లా విధుల్లోకి...
రాయలసీమ లిఫ్ట్ కు బ్రేక్...
కరువు సీమ రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు తోడ్పడుతుందని భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ సర్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా... వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని కూడా సర్కారు భావించింది. అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చేరుకుంది.
అయితే అనూహ్యంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీసుకున్న ఒక్క నిర్ణయం ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకట్ట వేసినట్లయింది. ఈ ప్రాజెక్టుపై తమకు చెప్పకుండా ముందుకు సాగొద్దని కృష్ణాబోర్డు తాజాగా ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖ పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ..
ఏపీ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు రాసిన తాజా లేఖలో విభజన చట్టం ప్రకారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా తమ అనుమతి తప్పనిసరని పేర్కొంది. తమకు సమగ్ర నివేదిక (డీపీఆర్) సమర్పించిన తర్వాత దాన్ని కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ పరిశీలనకు పంపుతామని వాటర్ బోర్డు తెలిపింది. ఈ రెండు చోట్ల నుంచి అనుమతి వస్తేనే ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము అనుమతి మంజూరు చేస్తామని వాటర్ బోర్డు ఏపీ సర్కారుకు రాసిన లేఖలో తెలిపింది. అంటే ఈ అనుమతులన్నీ లేకుండానే మీరు ప్రాజెక్టును టెండర్ల వరకూ తీసుకెళ్లారని వాటర్ బోర్డు చెప్పకనే చెప్పినట్లయింది. అయితే వాటర్ బోర్డు అభ్యంతరాల వెనుక అసలు కారణాలు వేరే ఉండొచ్చని తెలుస్తోంది.
అసలు ఉద్దేశమిదీ..
తెలంగాణలో కాళేశ్వరం తరహాలో రాయల సీమ ఎత్తిపోతల పథకాన్ని కర్నూలు జిల్లా సంగమేశ్వరం దగ్గర ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఈ పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకం చేపట్టాల్సి ఉంది. ఇక్కడ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రం నిర్మించాల్సి ఉంది. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
Recommended Video
కేసీఆర్ అభ్యంతరాలు...
ఎప్పుడైతే కృష్ణా నీటిని తోడుకునేందుకు వీలుగా ఈ ఫథకానికి రూపకల్పన చేశారో అప్పటి నుంచి తెలంగాణ అభ్యంతరాలు చెబుతూనే ఉంది. తాజాగా సీఎం కేసీఆర్ కూడా ఈ పథకాన్ని ముందుకు సాగనీయబోమనే సంకేతాలే ఇచ్చారు. దీంతో ఈ ప్ర్జాజెక్టుపై నీలి నీడలు ముసురుకున్నాయి. అనుకున్న విధంగానే కృష్ణాబోర్డుపై ఒత్తిడి తెచ్చి ఈ పథకానికి జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవనే వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో కృష్ణాబోర్డు కూడా డీపీఆర్ సమర్పించకుండా ప్రాజెక్టుపై ఎలా ముందుకెళతారంటూ కొర్రీలు పెట్టింది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టును నిలిపేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.