వైసీపీలోనే ఉంటా- అది రాజీనామా కాదు, థ్యాంక్స్ గివింగ్ నోట్-జగన్ ను కలిశాక సుచరిత కామెంట్స్
ఏపీలో కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇవాళ జగన్ తో భేటీ తర్వాత శాంతించారు. సీఎం జగన్ పిలుపు మేరకు ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయిన సుచరిత.. దాదాపు గంటసేపు చర్చించారు. అనంతరం బయటికి వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
2006లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని మేకతోటి సుచరిత తెలిపారు. 2009లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్పై గెలిచానని, వైయస్ మరణాంతరం జగన్తో తన రాజకీయ ప్రయాణం సాగిందన్నారు. గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సుచరిత తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయినట్లు ఆమె వెల్లడించారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్త మంత్రివర్గం ఉంటుందని సీఎం జగన్ నాడే చెప్పారని సుచరిత చెప్పుకొచ్చారు.
ఇవాళ జరిగిన భేటీలో 2024లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సీఎం జగన్ చెప్పారని సుచరిత వెల్లడించారు. తనను కుటుంబంలోని సభ్యురాలిగా జగన్ చూస్తారని సుచరిత పేర్కొన్నారు. పదవి ఆశించి రాకపోవడంతో కాస్త ఎమోషన్కు గురయ్యానన్నారు. అనారోగ్యం కారణంగా పనిచేయలేనంటూ సీఎం జగన్ కు థ్యాంక్స్ గివింగ్ నోట్ రాశానని సుచరిత వెల్లడించారు. కానీ పత్రికల్లో నేనే రాజీనామా చేశానని ఇష్టానుసారంగా రాశారని ఆమె మండిపడ్డారు. పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేస్తానన్నారు. సీఎం జగన్ను కలిసే స్వేచ్ఛ ఎప్పుడూ తనకు ఉంటుందన్నారు. 2012 నుంచే జగన్ దగ్గర తనకు స్వేచ్ఛ ఉందన్నారు.
మేకతోటి సుచరిత రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ గారితోనే ప్రయాణిస్తుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వస్తే ఒక వైసీపీ ఓటరుగానే ఉంటానన్నారు. పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని, నాడు కూడా జగన్తో ఉండాలని డిసైడై రాజీనామా చేశానన్నారు. ప్రజలు దీవించినంతకాలం అధికారంలో ఉంటామన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలే వైసీపీని అధికారంలో ఉంచుతాయని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు.