పవన్ కు మోడీ నుంచి మరో కాల్ ? నేడూ విశాఖలోనే -జగన్ తో చర్చల తర్వాత క్లారిటీ !
ఏపీలో ప్రధాని మోడీ వైజాగ్ పర్యటన ఆద్యంతం రాజకీయ పర్యటనగానే సాగుతోంది. విశాఖలో అడుగుపెట్టిన తర్వాత నిర్వహించిన రోడ్ షో, పవన్ కళ్యాణ్ తో ఐఎన్ఎస్ చోళలో భేటీ, అనంతరం బీజేపీ కోర్ కమిటీతో భేటీ.. ఇవాళ ఉదయం సీఎం జగన్ తో భేటీ.. ఇలా మోడీ వరుసగా రాజకీయ చర్చల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ప్రధాని మోడీ ఇవాళ కూడా ఆయన్ను విశాఖలో అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.

మోడీ-పవన్ భేటీ
నిన్న రాత్రి ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. శత్రు దుర్బేధ్యమైన ఈ గెస్ట్ హౌస్ లో ఇరువురు నేతల మధ్య పది నిమిషాల పాటు భేటీ జరుగుతుందని అంతా భావించినా చివరికి అది అరగంటకు పైగానే సాగింది. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయని, రాష్ట్రంలో రాజకీయాలపై ఆయనకు పూర్తిగా వివరించానని పవన్ చెప్పారు. అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు పవన్ ఇష్టపడలేదు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మోడీ-పవన్ చర్చలు ముగియలేదా ?
మోడీతో పవన్ చర్చలు నిన్నరాత్రి పూర్తిగా ముగియలేదనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆ తర్వాత జరగాల్సిన బీజేపీ కోర్ కమిటీ భేటీయే. ఇందులో బీజేపీ నేతలకు సుదీర్ఘంగా మార్గదర్శనం చేయాల్సిన పరిస్దితి ఉండటంతో పవన్ తో భేటీని ప్రధాని మోడీ ముందు పది నిమిషాలకే పరిమితం చేద్దామని భావించారు. కానీ పవన్ అక్కడికి చేరుకున్నాక పరిస్ధితి మారింది. ముఖ్యంగా పవన్ చెప్పిన విషయాలపై ఆసక్తి కనబరిచిన ప్రధాని పూర్తిసమయం మాత్రం కేటాయించలేకపోయినట్లు తెలుస్తోంది. అందుకే మరో దఫా చర్చిద్దామని చెప్పి పంపేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే పవన్ ప్రెస్ మీట్ ఉంటుందని జనసేన నేతలు ప్రకటించేయడంతో పవన్ మొహమాటంగానే ప్రెస్ మీట్లో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు.

మోడీ-పవన్ మరో భేటీ ?
నిన్న పవన్ కళ్యాణ్ తో చర్చలు హడావిడిగా ముగించాల్సి రావడంతో ఇవాళ మరోసారి పవన్ ను అవసరమైతే పిలిపించాలనే యోచనలో ప్రధాని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో భేటీ హడావిడిగా ముగియడం, అనంతరం బీజేపీ నేతలతో తీసుకున్న ఫీడ్ బ్యాక్ లో చర్చకు వచ్చిన విషయాల ఆధారంగా ప్రధాని మోడీ మరోసారి పవన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు. కానీ నిన్న జరిపిన చర్చలకు ఓ ఫలితం రావాలంటే మాత్రం మరోసారి పవన్ తో భేటీ కావాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ తో చర్చల తర్వాత క్లారిటీ ?
ఇవాళ విశాఖ బహిరంగసభకు ముందు ప్రధాని మోడీ సీఎం జగన్ తో భేటీ అవుతున్నారు. ఈ భేటీలోనూ పలు రాజకీయ అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలు చర్చకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గవర్నర్ , సీఎంలను మర్యాద పూర్వక భేటీకి ఆహ్వానించిన ప్రధాని.. ఈ భేటీలో జరిగే చర్చల్లో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ మాట్లాడితే మాత్రం ఆ తర్వాత పవన్ కు దాన్ని అప్ డేట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ పవన్ తో ప్రత్యేకంగా భేటీ కాలేకపోతే మాత్రం విమానాశ్రయానికి పవన్ ను పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖలోనే పవన్ వెయిటింగ్ ?
విశాఖపట్నంలో నిన్న ప్రధానితో భేటీ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ వాస్తవానికి ప్రధానితో పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలి. కానీ ఇవాళ కూడా ఆయన విశాఖలోనే ఉంటున్నారు. రేపు విజయనగరం బయలుదేరి వెళ్లబోతున్నారు. రేపటి విజయనగరం టూర్ కోసం పవన్ కావాలంటే నిన్న రాత్రి హైదరాబాద్ వెళ్లిపోయి రేపు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయినా విశాఖలోనే అందుబాటులో ఉండటం వెనుక ప్రధాని నుంచి మరో కాల్ వచ్చే అవకాశాలు ఉండటమే అని తెలుస్తోంది. అయితే ప్రధాని నుంచి కాల్ రాకపోతే మాత్రం పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు పవన్ సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications