మంగళగిరి నా ఇల్లు..పార్టీ కార్యకర్తలు నా వాళ్లు: నారా లోకేష్! ఫలితాల తరువాత తొలిసారి!
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చాలా రోజుల తరువాత కనిపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అభిమానులు ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో నారా లోకేష్ను కలిశారు. మాజీమంత్రి కొత్తపల్లి జవహర్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ఆరా తీశారు. నియోజకవర్గం స్థాయిలో పార్టీలో సంస్థాగతంగా లోపాలు ఉన్నాయని, నాయకుల సమన్వయ లోపం కనిపించిందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయి అందరినీ కలుపుకొని వెళ్లలేకపోయారని అన్నారు. ప్రత్యేకించి- రైతులు, దళితులు, పేద, దిగువ మధ్యస్థాయి కుటుంబీకుల ఆదరణను చూరగొన లేకపోయామని చెప్పారు. ఆయా ప్రజల నాడి పట్టడంలో పార్టీ యంత్రాంగం విఫలమైందని తేలింది.

నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోయినప్పటికీ..నాయకులందరూ ఒక వర్గం ఓటుబ్యాంకును మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేశారని, దీనికి అనుగుణంగా వ్యూహాలను రచించడం పట్ల ప్రతికూల ఫలితం ఎదురైందని విశ్లేషించారు.
అనంతరం- లోకేష్ మాట్లాడుతూ ఇకపై మరింత బాధ్యతతో పనిచేసి, ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని ఊరడించారు. ఫలితాలపై విశ్లేషణ కొనసాగుతోందని, దీని తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని చెప్పారు. తమకు పార్టీ నాయకత్వం అండగా ఉందని భరోసా కల్పించారు.

విజయం వరించినా, పరాజయం ఎదురైనా పార్టీ కార్యకర్తలనుతన కుటుంబ సభ్యులుగా చూస్తానని లోకేష్ చెప్పారు. కార్యకర్తల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. తానూ పార్టీ కార్యకర్తల్లో ఒకడినేని, మంగళగిరి నియోజకవర్గం తనకు సొంత ఇల్లు అని, గెలిచినా ఓడినా పార్టీ కార్యకర్తలతో ఉంటానని అన్నారు.












Click it and Unblock the Notifications