పోసాని తర్వాత వైసీపీలో ఆ ముఖ్యనేత ? అమరావతిలో ఊహాగానాలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతల్ని ఓ రేంజ్ లో టార్గెట్ చేసి వారందరినీ కటకటాల వెనక్కి నెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారిలో కీలకమైన వారిని అరెస్టు చేసి వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని బుక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అరెస్టు చేసిన టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వ్యవహారంతో పాటు ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు వీటిలో భాగంగా కనిపిస్తోంది.
గతంలో చంద్రబాబు, పవన్ పై పోసాని చేసిన వ్యక్తిగత కామెంట్స్ పై రాష్ట్రంలో దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా ఆయన్ను హైదరాబాద్ లో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాక రాజంపేట సబ్ జైలుకు పంపారు. అయితే ఈ మధ్యలో ఆయన్ను విచారించి రాసిన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాల్ని బట్టి చూస్తే తర్వాతి అరెస్టు ఎవరితో సులువుగా అర్దమవుతోంది. దీంతో పోసాని అరెస్టును మించిన సంచలనాలు త్వరలో నమోదుకావడం ఖాయంగా తెలుస్తోంది.

పోసాని వాంగ్మూలంలో తాను చంద్రబాబు, పవన్ పై తిట్టిన బూతుల స్క్రిప్ట్ వైసీపీ ప్రధాన కార్యదర్శి, అప్పట్లో సకల శాఖ మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డిదే అని ఆయన చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే సజ్జల అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఆఫీసుపై దాడి సహా పలు కేసుల్లో సజ్జలపాత్రపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినా అరెస్టు మాత్రం చేయలేకపోయారు. ఆయన వీటిపై కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడమో, తాత్కాలిక ఊరట పొందడమో జరిగాయి.
దీంతో ఇప్పుడు పోసాని వాంగ్మూలం ఆధారంగా సజ్జలను ఇవాళ, రేపట్లో అరెస్టు చేస్తారన్న ప్రచారం అమరావతి పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన వారే ఈ మేరకు లీకులు కూడా ఇస్తున్నారు. దీంతో సజ్జలను అరెస్టు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైనా చర్చలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications