పరారీలో ఎమ్మెల్సీ అనంతబాబు?.. పోస్టుమార్టంలో హత్యగా నిర్థారణ??
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. రెండురోజుల నుంచి జరుగుతున్న ఉద్రిక్త పరిణామాల మధ్య ఎట్టకేలకు సుబ్రమణ్యం పోస్టుమార్టం పూర్తయింది. ఆయన్నికొట్టి చంపినట్లుగా నివేదికలో వెల్లడైంది. ఇప్పటివరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు హత్య కేసుగా మార్పు చేశారు.

హత్యకేసుగా నమోదు
సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో తీసుకువచ్చి ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది హత్య అని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివిధ నాటకీయ పరిణామాల మధ్య శనివారం రాత్రి సుబ్రమణ్యం మృతదేహానికి వైద్యులు శవపంచనామా నిర్వహించారు. అందులో తీవ్రంగా గాయాలై మరణించినట్లు ఉండటంతో చివరకు హత్యకేసుగా నమోదు చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ముగిసిన అంత్యక్రియలు.. రేపటి నుంచి కేవీపీఎస్ ఆందోళనలు
పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సుబ్రమణ్యం మృతదేహాన్ని అతని స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా జి.మామిడాడకు తరలించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) నాయకులు నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రంలోగా అనంతబాబును అరెస్ట్ చేయాలని, లేదంటే సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అనుమానాస్పదంగా పోలీసుల తీరు
మొదటి నుంచి ఈ కేసులో పోలీసులు తీరు అనుమానాస్పదంగా ఉందని, నిందితుణ్ని రక్షించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడైన ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకోవాలని, కానీ అలా చేయలేదని, ఆయన దర్జాగా పెళ్లిళ్లకు, పేరంటాలకు తిరుగుతున్నారని మండిపడ్డారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ దొరకడంలేదని, అజ్ఞాతంలోకి వెళ్లారని, పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని చెబుతున్నారని, అంతేకాకుండా నోరు తెరవవద్దని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తుతున్నారు. ఎవరి అండ చూసుకొని ఎమ్మెల్సీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications