క్యాష్లెస్ టికెట్లకు ఏపీఎస్ ఆర్టీసీ పట్టు- ప్రథమ్ స్ధానంలో మరో యాప్ - జనవరి కల్లా
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. జనం బస్సు ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడటం లేదు. తప్పనిసరై ప్రయాణాలు చేయాల్సి వచ్చినా నగదు రహిత లావాదేవీలకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆర్టీసీలో ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ల జారీ కొనసాగుతున్నా సర్వర్పై అధిక భారం పడుతోంది. దీంతో మొబైల్ యాప్ను కూడా ప్రోత్సహించేందుకు ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రథమ్ పేరుతో యాప్ తీసుకొచ్చినా అది కాస్తా విఫలమైంది.
నగదు రహిత టికెట్ బుకింగ్స్ కోసం ప్రారంభించిన ప్రథమ్ యాప్ వైఫల్యం తర్వాత దాన్ని ఉపసంహరించుకున్న ఏపీఎస్ ఆర్టీసీ.. ఇప్పుడు దాని స్ధానంలో మరో కొత్త యాప్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 92 సాఫ్ట్ వేర్ సంస్ధలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. వీటిలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతూ, తక్కువ సమస్యలతో రూపొందించే యాప్నే ఈసారి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ముందుగా కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం-అవనిగడ్డ రూటులో ప్రయోగాత్మకంగా ఈ కొత్త యాప్లను పరీక్షిస్తున్నారు. విజయవంతమైతే రాష్టవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారు.

ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణికుల్లో కేవలం 39 శాతం మందే ఆన్లైన్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. మరో 61 మంది నేరుగా టికెట్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ టికెట్లను ప్రోత్సహించడం ద్వారా సంస్ధపై ఆర్ధిక భారం తగ్గించుకోవడంతో పాటు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ కొత్త యాప్ ప్రయోగాలు విజయవంతమైతే వచ్చే ఏడాది జనవరి నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.












Click it and Unblock the Notifications