ఆ దెబ్బకు మెట్టుదిగిన జగన్, పవన్ మన్నిస్తారా: బిజెపితో అంతవరకే!
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దెబ్బకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మెట్టు దిగారా? అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఆ దెబ్బ వైసిపి పైనే పడుతుంది.
అమరావతి: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దెబ్బకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మెట్టు దిగారా? అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఆ దెబ్బ వైసిపి పైనే పడుతుంది. దీనిని జగన్ గ్రహించారని అంటున్నారు.
ఈ కారణంగానే రాహుల్ గాంధీ గుంటూరు ప్రత్యేక హోదా సభ అనంతరం జగన్ ఇతరులతో కలిసి పని చేసేందుకు ఓ అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అంతేకాదు, బిజెపిపై ఆయన ఆశలు కొట్టేసుకున్నట్లుగా చెప్తున్నారు.
అందుకు పలు కారణాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఇతరులతో కలిసి పని చేసేందుకు జగన్ అంత సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా కనిపించలేదనే వాదనలు ఉన్నాయి.
కాంగ్రెస్తో లేదా, పవన్ కళ్యాణ్తో కలిసి ప్రత్యేక హోదా కోసం పని చేస్తే ఆ క్రెడిట్ పూర్తిగా తన ఖాతాలోకి రాదని జగన్ భావించారని అంటున్నారు. అందుకే పైకి మాత్రమే.. హోదా కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తామని చెప్పారని, కానీ ఒంటరిగా ముందుకు వెళ్తారని అంటున్నారు.

రాహుల్ పర్యటనతో వణుకు
విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ప్రత్యేక హోదా ఆ పార్టీకి ఊపిరి ఊదుతోంది. నిన్నటి వరకు హోదా కోసం జగన్, పవన్ కళ్యాణ్లు ఉద్యమించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వచ్చింది. రాహుల్ గుంటూరు సభ విజయవంతమైంది. కాంగ్రెస్ హోదా కోసం ఉద్యమించి, బలం పెంచుకుంటే అది వైసిపికే నష్టం.

అందుకే పవన్ కళ్యాణ్తో సై..
2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. నిన్నటి వరకు టిడిపి, జనసేనలు తమకు పోటీగా భావించారు. అయితే, 2014లో పవన్... టిడిపికి మద్దతిచ్చారు. కాబట్టి వారి మధ్య ఓట్లు చీలి తనకు లాభిస్తుందని జగన్ భావించారు. అందుకే హోదా లేదా ఇతర సమస్యలపై పవన్ గళమెత్తితే వైసిపి నుంచి స్పందన లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎదుగేందుకు సిద్ధమవడంతో పవన్ కళ్యాణ్తోను దోస్తీకి జగన్ సిద్ధమంటున్నారని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నాలు
నిన్నటి వరకు ప్రత్యేక హోదా ఉద్యమ బరిలో తానే నిలబడాలనుకున్నరు జగన్. ఓ వైపు ప్రత్యేక హోదాకు బదులు అంతకుమించి ప్యాకేజీ ఇస్తున్నామని బిజెపి, టిడిపిలు చెప్పడం, కాంగ్రెస్ పార్టీ హోదా రంగంలోకి దిగడంతో.. వచ్చే ఎన్నికలు తనకు ఇబ్బందికరంగా మారుతాయని భావించిన జగన్.. పవన్ కళ్యాణ్తో దోస్తీ అంశంపై మాట్లాడే బాధ్యతను ఓ కాపు నేతకు అప్పగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కలిసేనా?
ప్రధానితో మోడీతో భేటీ తదనంతర పరిణామాలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతుకు వైసిపి నిర్ణయం తీసుకోవడం.. ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తున్న వారికి రుచించడం లేదు. పవన్ అదే హోదా కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ దోస్తీ విన్నపాన్ని ఏ మేరకు మన్నిస్తారనేది ప్రశ్నార్థకమే.

బిజెపిని వదిలేసినట్లేనా... అక్కడి వరకే పరిమితమా?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తామని జగన్ చెప్పారు. ఇందుకు రాజకీయ కారణాలను పక్కన పెడితే.. కేసులు కూడా కారణమనే వాదనలు ఉన్నాయి. అయితే, మోడీ - జగన్ దోస్తీ అక్కడి వరకే పరిమితమనే వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి - బిజెపి పొత్తు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకే జగన్ కేవలం రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రమే ఎన్డీయేకు మద్దతిచ్చి.. ఆ తర్వాత తన దారి తాను చూసుకుంటారని అంటున్నారు. అందుకే ఇప్పటి నుంచి పవన్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications